రైతుల వద్ద నుంచి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. రైతుల వద్ద వున్న ఈ తరహా ధాన్యాన్ని తీసుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. 

అకాల వర్షాలతో బాధపడుతున్న అన్నదాతకు ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభవార్త చెప్పారు. రైతుల వద్ద నుంచి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అకాల వర్షాలు, సహాయక చర్యలు, ఇతర అంశాలపై సీఎం జగన్ బుధవారం అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాల్సిందిగా పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. రైతుల వద్ద వున్న ఈ తరహా ధాన్యాన్ని తీసుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఇప్పటికే కోసి వున్న ధాన్యాన్ని నిల్వ చేసేందుకు చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. 

కొనుగోలు కేంద్రాలు, ఆర్బీకేలు, రైతుల వద్దకాని ఎక్కడ ధాన్యం నిల్వలున్నా వాటిని వెంటనే అందుబాటులోని గోడౌన్లకు, ప్రభుత్వ భవనాల్లోకి తరలించాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. ఎన్యుమరేషన్‌ ప్రక్రియను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు ధాన్యం తరలింపు కోసం రవాణా ఖర్చుల కింద ప్రతి కలెక్టర్‌కూ రూ.1 కోటి రూపాయలను ఇప్పటికే కేటాయించామని, అధికారులు వాటిని వినియోగించుకుంటున్నారని ముఖ్యమంత్రికి వివరించారు. 

ఇన్‌పుట్‌ సబ్సిడీని విడుదల చేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్నారు జగన్. ప్రస్తుతం వర్షాలు, పంట విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి జిల్లాకు ఒక వ్యవసాయ శాస్త్రవేత్ తద్వారా రైతులకు అవగాహన కల్పించే చర్యలను చేపడుతున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పొలాల్లో ఉన్న మొక్కజొన్నను వెంటనే కొనుగోలు చేసేందుకు మార్క్‌ఫెడ్‌ అధికారుల ద్వారా చర్యలు తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రికి వివరించారు. వర్షాలు తగ్గగానే పంట నష్టపోయిన చోట రైతులకు అండగా నిలవడానికి సీఎం ఆదేశాల మేరకు విత్తనాలు పంపిణీచేస్తామని చెప్పారు.