ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను రప్పించేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ (adimulapu suresh) . ఉక్రెయిన్లో ఉన్న తెలుగు విద్యార్థులు క్షేమంగానే ఉన్నారని.. తల్లిదండ్రులు ఆందోళన పడొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను రప్పించేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ (adimulapu suresh) . ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (ys jagan mohan reddy) కేంద్రానికి లేఖ రాసి ప్రత్యేక శ్రద్ధతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని చెప్పారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధ వాతావరణం నేపథ్యంలో తెలుగు విద్యార్థుల కుటుంబాల్లో నెలకొన్న ఆందోళనపై మంత్రి ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఉక్రెయిన్లోని మెడికల్ విద్యార్థి యశ్వంత్తో ఫోన్లో మాట్లాడి అక్కడి పరిస్థితులు తెలుసుకున్నామని.. తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందవద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుందని ఆదిమూలపు హామీ ఇచ్చారు. ఉక్రెయిన్లో ఉన్న తెలుగు విద్యార్థులు క్షేమంగానే ఉన్నారని.. తల్లిదండ్రులు ఆందోళన పడొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఏపి ప్రభుత్వం విద్యార్థులను రప్పించేందుకు ప్రయత్నిస్తోందని.. ప్రస్తుతం ఉక్రెయిన్ లో విమాన సర్వీస్లు రద్దయ్యాయని, ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నామని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. విద్యార్థులకు సహాయం కోసం నోడల్ అధికారి, స్పెషల్ ఆఫీసర్ ని నియమించామని.. ఏపి భవన్లో అధికారులను అప్రమత్తం చేశామని మంత్రి చెప్పారు. పరిస్థితులు చక్కబడగానే విద్యార్థులను రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.
నోడల్ అధికారి : రవి శంకర్ ఫోన్ నెం. 9871999055 (ఏపీ భవన్)
అంతర్జాతీయ సహకారం కోసం ప్రత్యేక అధికారిగా రిటైర్డ్ ఐఎఫ్ఎస్ గీతేష్ శర్మ. సంప్రదించాల్సిన నెంబర్: 7531904820
ఏపీ ఎన్ఆర్టి సిఈఓ దినేష్ కుమార్: 9848460046
కాగా... ఉక్రెయిన్పై రష్యా యుద్ధం (russia ukraine war) నేపథ్యంలో అక్కడ భారతీయ విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని కీవ్లోని ఇండియన్ ఎంబసీ (indian embassy) భారత పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. దేశాన్ని విడిచి వచ్చేందుకు పలువురు భావిస్తున్నా.. టికెట్లు దొరకడం లేదు, దొరికినా వాటిని కొనుగోలు చేసేంత స్తోమత వారి వద్ద వుండటం లేదు. అటు ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల్లో 300 మంది తెలుగువారు కూడా వున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో విశాఖ జిల్లాకు చెందిన ఓ విద్యార్ధిని ఓ తెలుగు వార్తా సంస్థతో అక్కడి పరిస్ధితిని పంచుకుంది. రాజధాని కీవ్ నగరానికి 500కి.మీల దూరంలో తాము వున్నామని.. అక్కడ బాంబు పేలుళ్ల శబ్ధాలు ఇక్కడికి వినిపిస్తున్నాయని శ్రీజ చెప్పింది. చాలా భయంగా వుందని... తమకు కావాల్సిన వస్తువులను ఎవరూ ఇవ్వలేదని వాపోయింది. తామే బయటకు వెళ్లి కావాల్సిన వస్తువులను తెచ్చుకున్నామని... కొంచెం మాత్రమే ఆహారం దొరికిందని ఆమె తెలిపారు. మా ఇంఛార్జి సురక్షితంగా ఉంచుతామని చెబుతున్నారు తప్ప పంపిస్తామని మాత్రం చెప్పడం లేదని శ్రీజ పేర్కొన్నారు.
కీవ్ విమానాశ్రయంలో బాంబుదాడులు జరిగాయని... భూమి అంతా ఒకసారి కంపించినట్టు అనిపించిందని ఆమె చెప్పారు. తాము హాస్టళ్లలో ఉంటున్నామని.. ప్రజలు బయటకు రావడంలేదని శ్రీజ పేర్కొంది. అత్యవసరమైతే మెట్రో అండర్ గ్రౌండ్కు తీసుకెళ్తామని మా ఇంఛార్జి అంటున్నారని... భారతీయ విద్యార్థులందరినీ ఎవరి ఇళ్లకు వాళ్లను చేర్పించాలని ఆమె డిమాండ్ చేశారు. తనతోపాటు ఇక్కడ తెలుగువారు దాదాపు 300 మంది ఉన్నారని... కొందరు నిన్న, మొన్న వెళ్లిపోయారని, మొత్తంగా 3 వేల నుంచి 4వేల మంది భారతీయులు ఉక్రెయిన్లోనే వున్నారని శ్రీజ వెల్లడించారు. విమాన టిక్కెట్లు బుక్ చేసుకున్నా రద్దయిపోయాయని.. ఇండియన్ ఎంబసీని సంప్రదిస్తున్నా, ఇంకా స్పందనరాలేదుని ఆమె వాపోయారు. కుటుంబంతో ఎప్పటికప్పుడు టచ్లోనే ఉంటున్నానని .. అమ్మా, నాన్న చాలా భయపడుతున్నారని శ్రీజ ఆవేదన వ్యక్తం చేశారు.
