పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్. సోమవారం పోలవరం ప్రాజెక్ట్ పనులను ముఖ్యమంత్రి పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించారు
పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్. సోమవారం పోలవరం ప్రాజెక్ట్ పనులను ముఖ్యమంత్రి పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని జగన్ స్పష్టం చేశారు. ముందుగా నిర్దేశించుకున్న ప్రకారం ఎఫ్ఆర్ఎల్ లెవల్ 45.72 మీటర్లు ఉంటుందని తెలిపారు.
టాప్ ఆఫ్ మెయిన్ డ్యాం లెవల్ 55 మీటర్లు ఉంటుందని సీఎం అన్నారు. డ్యామ్తో పాటు పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆర్థిక పరమైన అంశాలన్నీ త్వరలోనే పరిష్కారమవుతాయని ..నిర్వాసితులకు న్యాయం చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.
మే నెలాఖరు నాటికి స్పిల్వే, స్పిల్ ఛానల్ పనులు పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ద్వారా నీరందించేలా పనులు పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.
కాపర్ డ్యాం గ్యాప్లు మూసివేసే సమయంలో డెల్టాకు సాగునీరు, తాగునీటి కొరత రాకుండా ఎలాంటి ప్రత్యామ్నాయాలు అనుసరించాలన్నదానిపై కార్యాచరణ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఈ విషయమై యాక్షన్ ప్లాన్ తయారుచేసి ఇస్తామని ఇరిగేషన్ అధికారులు సీఎంకు చెప్పారు. అంతకు ముందు హెలికాఫ్టర్లో పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు హెలిప్యాడ్ వద్ద మంత్రులు ఘన స్వాగతం పలికారు.
