రిపబ్లిక్ డే వేడుకలు : ఏపీ రాజ్భవన్లో ఎట్ హోం.. సతీమణితో కలిసి హాజరైన ముఖ్యమంత్రి జగన్
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్, హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, మంత్రులు , ఎమ్మెల్యేలు, పలువురు అధికారులు హాజరయ్యారు.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. ఈ విందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి దంపతులతో పాటు ఏపీ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, మంత్రులు , ఎమ్మెల్యేలు, పలువురు అధికారులు హాజరయ్యారు. ఎట్ హోమ్కు హాజరైన అతిథులను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరుపేరునా పలకరించారు.
అంతకుముందు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్పిపల్ స్టేడియంలో జరిగిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు భేష్ అని.. డీబీటీ ద్వారా నవరత్నాలు , అమ్మఒడి వంటి పథకాలు అర్హులకే అందుతున్నాయని ఆయన చెప్పారు. అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలతో రాష్ట్రం ముందుకు సాగుగుతుందని గవర్నర్ చెప్పారు. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా విద్యార్ధులకు పౌష్టికాహరం అందిస్తున్నామన్నారు. జగనన్న విద్యా కానుక ద్వారా విద్యార్దులకు పుస్తకాలు, దుస్తులు, కిట్స్ అందిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.ఇంగ్లీష్ మీడియం ద్వారా విద్యార్ధులకు సీబీఎస్ఈ సిలబస్ ను అందిస్తున్నట్టుగా గవర్నర్ గుర్తు చేశారు. విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ALso REad: ఏపీలో 11 బోధనాసుపత్రుల నిర్మాణం: రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ బిశ్వభూషణ్
నాడు- నేడు ద్వారా ప్రభుత్వ పఠశాలల అభివృద్ది జరిగిందని ఆయన చెప్పారు. రాష్ట్ర ఆర్ధిక రంగానికి వ్యవసాయం వెన్నెముక అని గవర్నర్ తెలిపారు. రైతాంగానికి అండగా ఉండేందుకు ప్రభుత్వం రాష్ట్రంలో 10 వేల రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నట్టుగా గవర్నర్ బిశ్వభూషణ్ వివరించారు. రైతు పండించిన పంటకు మద్దతు ధర అందించి రైతులకు అండగా ప్రభుత్వం నిలిచిందన్నారు. ప్రతి ఏటా రైతులకు రూ.13,500 సహాయం అందిస్తున్న విషయాన్ని గవర్నర్ గుర్తు చేశారు. 37 లక్షల మంది రైతులకు వైఎస్ఆర్ పంటల భీమాను వర్తింపచేసినట్టుగా గవర్నర్ చెప్పారు. త్వరలోనే సంచార పశువైద్య క్లినిక్ లు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు.