Asianet News TeluguAsianet News Telugu

పర్వతారోహణలో ప్రపంచరికార్డ్... తెలుగుతేజం భువన్ జై ని అభినందించిన సీఎం జగన్

అతి చిన్న వయసులో అత్యంత ఎత్తయిన పర్వతాన్ని అధిరోహించి అంతర్జాతీయ స్థాయిలో దేశ కీర్తిని మరింత పెంచిన తెెలుగుతేజం గంధం భువన్ జై ని సీఎం జగన్ అభినందించారు.  

AP CM YS Jagan Appreciates Gandham Bhuvan Jai
Author
Amaravati, First Published Sep 29, 2021, 10:42 AM IST

అమరావతి: కేవలం ఎనిమిదేళ్ల వయసులోనే యూరోప్ లోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ ఎల్బ్రస్ (Mt Elbrus)ను విజయవంతంగా అధిరోహించిన తెలుగు బాలుడు మాస్టర్‌ గంధం భువన్‌ జై ని సీఎం జగన్ అభినందించారు. దేశ ఖ్యాతిని ప్రపంచస్థాయితో చాటిచెప్పిన చిన్నారి తెలుగుతేజం భువన్ తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిసాడు. అతి చిన్న వయసులో ప్రపంచ రికార్డు నెలకొల్పిన బాలుడి ధైర్యసాహసాలను మెచ్చుకున్న సీఎం ప్రోత్సహించిన తండ్రిని, కోచ్ ను కూడా అభినిందించారు.  

క్యాంప్ కార్యాలయానికి వచ్చిన భువన్ జైకి స్వయంగా పుష్ఫగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు సీఎం జగన్. అనంతరం బాలుడికి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా భువన్ జై తాను సాధించిన ప్రపంచ రికార్డుకు సంబంధించిన సర్టిఫికెట్ ను సీఎంకు చూపించారు.  

ఏపీ మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు తనయుడే ఈ భువన్‌ జై. తండ్రితో పాటు కోచ్‌ శంకరయ్య, రెవెన్యూ, పర్యాటక, క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవతో కలిసి సీఎం జగన్ ను కలిసారు భువన్ జై. 

read more  Mount Elbrus : ఎత్తైన పర్వతాన్ని అధిరోహించిన అతిచిన్న వయసు భారతీయుడిగా.. భువన్ రికార్డ్..

AP CM YS Jagan Appreciates Gandham Bhuvan Jai

యూరప్ ఖండంలోనే ఎతైన శిఖరంగా పేరుగాంచిన రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని మాస్టర్ గంధం భువన్ అధిరోహించి చరిత్ర సృష్టించారు. కేవలం ఎనిమిది సంవత్సరాల మూడు నెలల వయస్సులో భువన్ దీనిని సుసాధ్యం చేశారు. ఈనెల 18వ తేదీన 5642 మీటర్ల ఎత్తెన మౌంట్ ఎల్బ్రస్ శిఖరాన్ని చేరుకున్న అతి పిన్న వయస్కుడైన భారతీయునిగా రికార్డుల సృష్టించారు. 

ఏ మాత్రం అనుకూలతలేని భిన్నమైన వాతావరణంలో ఎంతో శ్రమకోర్చి భువన్ దీనిని సాధించాడు. చిన్ననాటి నుండే పర్వతారోహణ పట్ల ఎంతో ఆసక్తిని ప్రదర్శించిన భువన్ కు తల్లిదండ్రులు ప్రోత్సాహం తోడయ్యింది. సీనియర్ ఐఎఎస్ అధికారి గంధం చంద్రుడు కుమారుడైన భువన్ ప్రస్తుతం మూడవ తరగతి చదువుతున్నాడు.

శిక్షకులు అందించిన మెళుకువలు, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే  తాను ఈ రికార్డును సాధించగలిగానని చిన్నారి భువన్ చెబుతున్నాడు. అతి శీతల వాతావరణం సవాల్ గా మారినప్పటికీ, పలు ఇబ్బందులు చవిచూస్తూ అనుకున్న విధంగానే సాహోసోపేతమైన యాత్రను ముగించామన్నారు. కర్నూలు జిల్లా స్వస్ధలం అయిన మాస్టర్ భువన్ చిన్ననాటి నుండి క్రీడలలో ఉత్సాహం ప్రదర్శించేవాడు. దీంతో కుమారుని ప్రతిభను గుర్తించిన చంద్రుడు అనంతపురంకు చెందిన స్పోర్ట్స్ కోచ్ శంకరయ్య వద్ద శిక్షణ ఇప్పించారు. 

AP CM YS Jagan Appreciates Gandham Bhuvan Jai

అనంతపురం జిల్లా రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ కోచ్ అయిన శంకరయ్య స్వయంగా పర్వతారోహకుడు కావటంతో భువన్ శిక్షణలో వ్యక్తిగత శ్రద్ధను కనబరిచారు. చిన్నారులకు పర్వతారోహణలో మంచి శిక్షణను అందించే శంకరయ్య తన బృందానికి కడప జిల్లా గండికోటలోని అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణను కొనసాగించారు. భువనగిరిలోని ట్రాన్సెండ్ ఎడ్వంచర్స్ కోచ్ శంకరబాబు వద్ద కూడా పర్వతారోహహణలో మెళుకువలు నేర్చుకున్న భువన్,  రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించే క్రమంలో మాస్టర్ భువన్ సెప్టెంబర్11న భారతదేశం నుండి రష్యాకు బయలుదేరారు.

టెర్స్‌కోల్ మౌంట్ ఎల్‌బ్రష్ బేస్‌కు 12న చేరుకున్నారు. అలవాటు కోసం సెప్టెంబర్ 13న 3500 మీటర్లు అధిరోహించి తిరిగి బేస్ క్యాంప్‌కు చేరుకున్నారు. సెప్టెంబర్ 14న 3500 మీటర్లు అవరోహణ చేసి అక్కడే రాత్రి బస చేసారు. 15న 4000 మీటర్ల ఎత్తువద్ద నిర్ధేశించిన శిబిరానికి చేరుకున్నారు.  అక్కడే 16, 17 తేదీలలో కొంత శిక్షణ అనంతరం, 18న 5642 మీటర్ల ఎత్తైన ఎల్బ్రస్ పర్వత శిఖరాన్ని చేరుకున్నారు. 

 
 

Follow Us:
Download App:
  • android
  • ios