సారాంశం

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణకు సీఐడీ అధికారులు  మరోసారి నోటీసులు జారీ చేశారు. వాట్సాప్‌ ద్వారా నోటీసులు పంపించారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణకు సీఐడీ అధికారులు  మరోసారి నోటీసులు జారీ చేశారు. వాట్సాప్‌ ద్వారా నోటీసులు పంపించారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్‌కు సంబంధించిన కేసులో ఈ నెల విచారణకు హాజరుకావాలని సీఐడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో నారాయణ ఏ2గా ఉన్న  సంగతి తెలిసిందే. ఇక, ఇదే కేసుకు సంబంధించి నారా లోకేష్‌కు కూడా ఇటీవల సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 4న తాడేపల్లి సీఐడీ కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆ నోటీసులో కోరారు. దీంతో ఈ నెల 4న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శితో పాటు నారాయణను  కూడా సీఐడీ అధికారులు విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక, అమరావతి రాజధాని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయని ఏపీ సీఐడీ ఆరోపిస్తుంది. ఈ కేసు విషయాని వస్తే.. టీడీపీ నేతల ఆధీనంలో ఉన్న భూముల విలువను పెంచేందుకే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు డిజైన్‌ను మార్చారని వైసీపీ ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు సంబంధించి గతేడాది ఏప్రిల్‌లో ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద సీఐడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబు నాయుడు, నారాయణ, లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, ఆర్కే హౌసింగ్ లిమిటెడ్‌కు చెందిన కేపీవీ అంజనీ కుమార్, రామకృష్ణ హౌసింగ్, హెరిటేజ్ ఫుడ్స్ తదితరుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.

ఈ కేసులో నారా లోకేష్‌ను ఏ14గా పేర్కొంటూ విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ కోర్టులో సెప్టెంబర్‌ 26న ఏపీ  సీఐడీ మెమో దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో కొంత మందికి లబ్ధి చేకూరేలా మార్పులు చేయడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారని సీఐడీ ఆరోపించింది. అమరావతి రాజధాని ప్రాంతంలో పారిశ్రామికవేత్త లింగమనేని రమేశ్‌ కుటుంబానికి లోకేష్ సాయం చేశారనే ఆరోపణలు  ఉన్నాయి. ఈ కేసులో లింగమనేని రమేష్‌ ఏ3గా ఉన్నారు.