మాజీ మంత్రి గౌతు శివాజీ కూతురు, టిడిపి నాయకురాలు గౌతు శిరీషకు ఆంధ్ర ప్రదేశ్ సిఐడి అధికారులు నోటీసులు జారీ చేసారు.
అమరావతి: ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టినా వెంటనే అరెస్టులో, పోలీస్ కేసులో, సీఐడి నోటీసులో ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ సహా చాలామంది కీలక నేతలపై పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఇక ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, బిసి జనార్ధన్ రెడ్డి, జేసి ప్రభాకర్ రెడ్డి నాయకులను ఏకంగా అరెస్ట్ చేసి జైలుకు పంపింది వైసిపి ప్రభుత్వం. ఇప్పటివరకు ప్రత్యక్షంగా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకున్న వైసిపి సర్కార్ ఇప్పుడు వీటికి సహకరించిన వారిపైనా ఉక్కుపాదం మోపుతోంది.
తాజాగా సోషల్ మీడియాలోనూ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ప్రచారం చేసినా జగన్ సర్కార్ వదిలిపెట్టడం లేదు. ఇటీవల ఆర్థిక కారణాలతో ప్రభుత్వ పథకాలైన అమ్మఒడి, వాహనమిత్ర రద్దయినట్లు. 2022 సంవత్సరానికి గాను ఈ పథకాల లబ్ధిదారులకు ప్రభుత్వ సహాయం అందదంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చక్కర్లు కొడుతోంది. అయితే ప్రభుత్వ చిహ్నంతో ఇలా తప్పుడు పోస్టులను సోషల్ మీడియాలో పెట్టారంటూ టిడిపి నాయకురాలు గౌతు శిరీష (gouthu sirisha) కు సిఐడి నోటీసులు అందించింది.
నిన్న (శనివారం) రాత్రి 10గంంటల సమయంలో గౌతు శిరీష, ఆమె తండ్రి, మాజీ మంత్రి గౌతు శివాజీని ఏపీ సీఐడి అధికారులు కలిసారు. వచ్చే సోమవారం (జూన్ 6వ తేదీన) ఉదయం 10గంటలకు మంగళగిరిలోకి సీఐడి ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సిందిగా సీఆర్పిసి సెక్షన్ 41ఏ కింద శిరీషకు నోటిసులు అందించారు.
ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తూ వాహనమిత్ర, అమ్మఒడి రద్దు చేసారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పై గత నెల (మే 30న) చివర్లో సీఐడి కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఇప్పటికే అచ్చెన్నాయుడు (kinjarapu atchannaidu)ముఖ్య అనుచరుడిని సీఐడి (AP CID) అధికారులు ఇటీవల అదుపులోకి తీసుకుని విచారించారు. తాజాగా గౌతు శిరీషను కూడా విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు జారీ చేసారు.
టెక్కలి (tekkali) నియోజకవర్గ ఐటిడిపి కోఆర్డినేటర్ గా అప్పిని వెంకటేశ్ ను సీఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వైసిపి (ysrcp) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న అమ్మ ఒడి (amma odi), వాహనమిత్ర (vahanamithra) పథకాలను ఈ ఏడాది రద్దు చేసినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చక్కర్లు కొడుతోంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న జగన్ సర్కార్ ఈ రెండు సంక్షేమ పథకాలను నిలిపివేస్తున్నట్లు ఈ పోస్ట్ సారాంశం.
ఈ క్రమంలోనే టెక్కలి టిడిపి నాయకుడు వెంకటేశ్ ఈ పోస్ట్ ను షేర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో గురువారం ఉదయం వెంకటేశ్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు గత గురువారం ఉదయం నుండి సాయంత్రం వరకు విచారించారు. అనంతరం అతడిని వదిలిపెట్టి తిరిగి శుక్రవారం కూడా మళ్లీ విచారించారు. ఇలా రెండురోజుల పాటు విచారించారు. ఈ క్రమంలోనే గౌతు శిరీష ఈ పోస్ట్ ను సోషల్ మీడియాలో పెట్టినట్లు గుర్తించి ఆమెను విచారణకు హాజరుకాావాలంటూ నోటీసులిచ్చారు.
