ఆ డెయిరీలు అమూల్ చేతికే : ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం
ఈ నెల 13న రైతుల ఖాతాల్లో రైతు భరోసా కింద రూ.4,050 కోట్లు జమ చేస్తామన్నారు ఏపీ మంత్రి పేర్నినాని. మంగళవారం సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా భేటీ వివరాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు
ఈ నెల 13న రైతుల ఖాతాల్లో రైతు భరోసా కింద రూ.4,050 కోట్లు జమ చేస్తామన్నారు ఏపీ మంత్రి పేర్నినాని. మంగళవారం సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా భేటీ వివరాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు.
రైతు భరోసా వల్ల 54 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ఆయన తెలిపారు. మే 25న వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా నగదు జమచేస్తామని దీని వల్ల 38 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని నాని చెప్పారు.
మే 18న వైఎస్ఆర్ మత్స్యకార భరోసా నగదు జమ చేస్తామని.. వేటకెళ్లే మత్స్యకారులకు రూ.10 వేల చొప్పున సాయం చేస్తామని మంత్రి వివరించారు. 7వ తరగతి నుంచి సీబీఎస్ఈ సిలబస్లో విద్యాబోధనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా 44,639 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెడతామని నాని చెప్పారు. పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోనే సీబీఎస్ఈ విద్యాబోధన వుంటుందని మంత్రి పేర్కొన్నారు.
నాడు - నేడు ద్వారా పాఠశాలల రూపు రేఖలు మారుస్తున్నామని.. ప్రభుత్వ స్కూళ్లలో చదివేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని నాని వెల్లడించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు.
Also Read:ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ: కర్ఫ్యూకి ఆమోదముద్ర... కీలక నిర్ణయాలు
పాఠశాల విద్య కోసం ప్రపంచబ్యాంక్ నుంచి రూ.1860 కోట్ల అప్పు తీసుకుంటున్నట్లు నాని పేర్కొన్నారు. దీనికి 2.5 శాతం స్వల్ప వడ్డీ కట్టాల్సి వుంటుందని వెల్లడించారు. ఎయిడెడ్ విద్యా సంస్థల్లో అరకొర చదువులు చెబుతున్నారని.. ఎయిడెడ్ సంస్థలు ప్రభుత్వానికి అప్పగిస్తే మంచిదని నాని సూచించారు.
వీటిని ప్రభుత్వమే అన్ని బాధ్యతలు తీసుకుని నిర్వహిస్తుందని మంత్రి తెలిపారు. ప్రైవేట్ యూనివర్సిటీల్లో 35 శాతం సీట్లు కన్వీనర్ కోటాకు ఇవ్వాలని.. ఆ 35 శాతం సీట్లకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లిప్పులు ఇస్తామని నాని పేర్కొన్నారు.
ఏపీలో మూసేసిన సహకార డెయిరీలను అమూల్కు అప్పగిస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 708 గ్రామాల్లో అమూల్ సేవలు వుంటాయని.. దీని ద్వారా రైతులకు మంచి రేటు వస్తుందని నాని చెప్పారు.
ఏ కేటగిరి దేవాయాల్లోని అర్చకుల వేతనం 10 వేల నుంచి 15 వేలకు పెంచుతూ కేబినెట్ తీర్మానం చేసిందన్నారు. అలాగే బి కేటగిరి ఆలయాల్లోని అర్చకులకు రూ.5 వేల నుంచి రూ.10 వేల కు గౌరవ వేతనం పెంచుతున్నామన్నారు.
ఇమామ్లకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు, మౌజమ్లకు రూ.3 వేల నుంచి రూ.5 వేలకు గౌరవ వేతనం పెంచుతున్నామన్నారు. పట్టా రైతులతో సమానంగా అసైన్డ్ దారులకు కూడా భూసేకరణ పరిహారం చెల్లిస్తామని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో రూ.511.79 కోట్లతో 176 పీహెచ్సీల ఏర్పాటుకు కేబికేట్ ఆమోదం తెలిపిందని నాని వెల్లడించారు. ప్రతి ఏజెన్సీ మండలానికి మూడు పీహెచ్సీలతో పాటు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇద్దరు డాక్టర్లు, 104 వాహనం సమకూరుస్తామన్నారు.