పెన్షన్ విధానంపై బిల్లు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఈరోజు ఉదయం సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ సచివాలయంలో ఈరోజు ఉదయం సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలుపడటంతో పాటు, కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లు రూపకల్పనకు ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ బిల్లు 2023 పేరుతో కొత్త పెన్షన్ను తీసుకురానుంది. సీపీఎస్ ఉద్యోగుల కోసం సీపీఎస్ స్థానంలో ఏపీ జీపీఎస్ బిల్లు తీసుకొచ్చింది. అలాగే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే 2014 విభజన నాటికి ఐదేళ్లు పూర్తి చేసుకన్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక, 12వ పీఆర్సీ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది.
ఈ ఏడాది జగనన్న అమ్మఒడి పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఈ ఏడాది విద్యాకానుక పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. 18.58 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు స్మార్ట్ మీటర్ల బిగింపునకు రూ. 6,888 కోట్ల వ్యయం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ నెట్ కోసం రూ.445 కోట్ల రుణాల కోసం ఏపీఎఫ్ఎస్ఎల్కు కేబినెట్ అనుమతి ఇచ్చింది.
విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో ఎంవోయూలు చేసుకున్న పలు సంస్థలకు భూ కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.