భారీగా ఖర్చు పెట్టి సీఎం జగన్ దావోస్ వెళ్లి రావడం వల్ల ఏపీకి కలిగిన ప్రయోజనం ఏం లేదన్నారు బీజేపీ నేత విష్ణు వర్థన్ రెడ్డి. వైసీపీ నేతల అవినీతితోనే ఏసీబీ యాప్ మొదలు పెట్టాలని ఆయన చురకలు వేశారు.  

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (ys jagan) దావోస్ పర్యటన వల్ల రాష్ట్రానికి ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేదన్నారు బీజేపీ (bjp) నేత విష్ణువర్ధన్ రెడ్డి (vishnu vardhan reddy) . గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారీగా ఖర్చు పెట్టి, దావోస్ వెళ్లి ఏం సాధించారని ప్రశ్నించారు. దేవాలయాల ఆస్తులపై ప్రభుత్వానిదే నిర్ణయమని ఒక మంత్రి అనడం దారుణమని విష్ణువర్ధన్ రెడ్డి దుయ్యబట్టారు. మసీదుల్లో మౌజన్లకు, పాస్టర్‌లకు డబ్బులు ఇస్తూ దేవాలయంలో మాత్రం ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆయన నిలదీశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

బీజేపీ అధికారంలోకి వస్తే చర్చిలు, మసీదుల మాదిరిగా దేవాలయాలను కూడా స్వేచ్ఛగా ఉంచుతామని విష్ణువర్థన్ రెడ్డి స్పష్టం చేశవారు. ఇక గ్రూప్ 1 పరీక్షల అభ్యర్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని... దీనిపై గవర్నర్ కు లేఖ రాస్తామని చెప్పారు. అవినీతిపై ఫిర్యాదులకు యాప్ (acb app) ప్రవేశ పెడుతుండటంపై ఆయన మాట్లాడుతూ... వైసీపీ నేతల అవినీతితోనే దాన్ని మొదలు పెట్టాలని విష్ణువర్ధన్ రెడ్డి చురకలు వేశారు. 

Also Read:జనసేనతో చర్చించే ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీ పోటీ: ఎంపీ జీవీఎల్ నర్సింహారావు

అంతకుముందు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు (gvl narasimha rao) మాట్లాడుతూ.. జనసేనతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికకు సంబంధించి జనసేనను సంప్రదించిన తర్వాతే బీజేపీ బరిలోకి దిగిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన ప్రత్యామ్నాయ కూటమిగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తాయని తాము అనేక సందర్భాల్లో చెప్పడం జరిగిందన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడినప్పుడు కూడా బీజేపీతోనే పొత్తు ఉందని చెప్పారని గుర్తుచేశారు. ఈ కూటమి 2024లో ప్రత్యామ్నాయంగా నిలబడుతుందని చెప్పారు. 

మరోవైపు విశాఖలోని రుషికొండ తవ్వకాలపై సుప్రం కోర్టు ఆదేశాలను ప్రభుత్వం కచ్చితంగా పాటించాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. టూరిజం అభివృద్ది అంటూనే అక్కడ ఏదో స్కెచ్ వేసినట్టుగా అనుమానం కలుగుతుందన్నారు.రుషికొంద తవ్వకాలను కేంద్ర టూరిజం శాఖ పరిశీలిస్తుందని ఆయన చెప్పారు. రుషికొండలో ప్రైవేట్ ప్రాపర్టీ కోసం ప్రయత్నాలు చేస్తే అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులను ACB పరిధిలోకి తెస్తే అవినీతి బయటపడుతుందని జీవీఎల్ అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తన విశ్వసనీయతను నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.