ఆంధ్రప్రదేశ్ బీజేపీ పంచాయితీ ఢిల్లీకి చేరింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును వ్యతిరేకిస్తున్న అసమ్మతి నేతలు వారి గళం వినిపించేందుకు ఢిల్లీకి చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ పంచాయితీ ఢిల్లీకి చేరింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును వ్యతిరేకిస్తున్న అసమ్మతి నేతలు వారి గళం వినిపించేందుకు ఢిల్లీకి చేరుకున్నారు. దాదాపు 25 మంది అసమ్మతి నేతల ఢిల్లీకి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. వీరంతా ఈ రోజు మధ్యాహ్నం పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మురళీధరన్తో సమావేశమై పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి జాతీయస్థాయిలో పార్టీ పదవుల్లో ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి, సత్యకుమార్ కూడా హాజరుకానున్నట్టుగా సమాచాం.
ఈ సమావేశం ద్వారా.. చాలా కాలంగా పార్టీని నమ్ముకున్న వాళ్లకు జరుగుతున్న అన్యాయం, పదవుల్లో ఉన్నవారి తొలగింపు, కొత్తవారి నియామకాల్లో జరుగుతున్న పరిణామాలను అసంతృప్త నేతలు బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్దమైమయ్యారు. ఈ సమావేశం తర్వాత మరికొందరు బీజేపీ పెద్దలను కలవాలనే ఆలోచనతో వీరు ఉన్నట్టుగా తెలుస్తోంది.
అయితే కొంతకాలంగా ఏపీలోని బీజేపీ నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వైఖరిని పలువురు నేతలు వ్యతిరేకిస్తున్నారు. సోము వీర్రాజు అందరినీ కలుపుకుపోవడం లేదని వారు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఆయన వైఖరితో పార్టీ రాష్ట్రంలో నష్టపోతుందని వాదనలు కూడా వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే అధిష్టానానికి కొందరు నేతలు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే సీనియర్ నేత సునీల్ ధియోధర్ మాత్రం వచ్చే ఎన్నికలవరకు సోము వీర్రాజునే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతారనే ప్రకటన చేశారు. అయితే అప్పటి నుంచి అసంతృప్త నేతలు తీవ్రంగా రగిలిపోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక, ఇటీవల పార్టీని వీడిన కన్నా లక్ష్మీనారాయణ కూడా.. రాష్ట్ర నాయకత్వంపైనే తీవ్ర విమర్శలు చేశారు. అయితే సోము వీర్రాజు వైఖరి వల్లే కన్నా పార్టీని వీడినట్టుగా బీజేపీలోని కొందరు రాష్ట్ర నాయకులు అంతర్గత చర్చల్లో మాట్లాడుకుంటున్నారు.
