రాష్ట్రంలో అధ్వాన్నంగా వున్న రోడ్ల పరిస్ధితికి సంబంధించి ఏపీ సీఎం వైఎస్ జగన్పై విమర్శలు గుప్పించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఈ మేరకు వైసీపీకి కూడా కొత్త అర్ధాన్ని చెప్పారు వీర్రాజు.
రాష్ట్రంలో అధ్వాన్నంగా వున్న రోడ్ల పరిస్ధితికి సంబంధించి ఏపీ సీఎం వైఎస్ జగన్పై విమర్శలు గుప్పించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. శనివారం ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ జులై 15 సాయంత్రం కల్లా రోడ్లు మొత్తం రెడి అవుతాయి.జులై 20న ఫోటో గ్యాలరీ చేసి ప్రజలకు చూపిస్తాము. ఈ మాట గుర్తుందా? @ysjagan గారు!గుర్తుంటే "మాట తప్పం-మడమ తిప్పం" అనే మీ నినాదం ఏమైనట్టు? ప్రజలు మీ సమాధానం కోసమే ఎదురుచూస్తున్నారు. (Y ) వైఫల్యం (C ) చెందిన (P ) పార్టీ’’ అంటూ సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాగా... ఆంధ్రప్రదేశ్ లోని రోడ్ల దుస్థితిని తెలుపుతూ.. ముఖ్యమంత్రిని మేల్కొలిపే #GoodMorningCMSir అనే డిజిటల్ క్యాంపెయిన్ ను జనసేన ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీంట్లో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు మరో వ్యంగ్య కార్టూన్ ట్వీట్ చేశారు. శుక్రవారం ఉదయం 8 గం.కు పవన్ కళ్యాణ్ రావులపాలెం నుంచి అమలాపురం వెళ్ళే రోడ్డు దుస్థితిని తెలిపే వీడియోను ట్విటర్ లో పోస్టు చేశారు. ఈ వీడియోలో కొత్తపేట దగ్గర ఉన్న గుంతలు, అక్కడి పరిస్థితి తెలుస్తోంది. ఈ వీడియోను పోస్టు చేస్తూ #GoodMorningCMSir అని హ్యాష్ ట్యాగ్ వేశారు.
దీంతోపాటు రాష్ట్రంలో రోడ్డు ప్రయాణం ఎంత నరకప్రాయంగా మారిందో తెలియచేసేలా ఉన్న వ్యంగ్య చిత్రాన్నిపవన్ కళ్యాణ్ గారు పోస్టు చేశారు. హెలికాప్టర్ లో వెళ్తున్న సీఎం రోడ్డు మీద ద్విచక్ర వాహనాలపై వెళ్ళే వాళ్ళను వింతగా చూస్తుంటారు. ఒక్కో గోతిలో నుంచి గాల్లో ఎగిరి అంతా దూరాన మరో గోతిలో ఉన్న నీళ్ళలో పడుతుంటే వారి వాహనాలు గాల్లో ఉన్నట్లు ఆ వ్యంగ్య చిత్రం ఉంది. రాష్ట్రంలో రోడ్లపై ప్రయాణిస్తున్నవారిని పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో ఆ కార్టూన్ తెలియచేస్తుంది.
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇటీవలి కాలంలో రోడ్లు బాగా పాడయ్యాయని.. రోడ్లు వేయండి మహాప్రభో అని ప్రజలు గగ్గోలు పెడుతుంటే.. జగనన్న ‘ఉయ్యాలా-జంపాలా’ పథకంలో భాగమే ఈ రోడ్లని సోషల్ మీడియా వేదికగా రోడ్ల దుస్థితిని షేరు షేస్తూ మీమ్స్, సెటైర్స్ వెల్లువెత్తుతుంటాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు మరీ దారుణంగా మారిపోయాయి. దీనిమీద జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా గురువారం కూడా ఓ కార్టూన్ కౌంటర్ ఇచ్చారు.
