తిరుమలలో వసతి గదుల అద్దె పెంచడాన్ని నిరసిస్తూ బీజేపీ ఆందోళనలు.. ప్రభుత్వంపై సోము వీర్రాజు ఆగ్రహం..
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తిరుమలలో వసతి గదుల అద్దె పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీ బీజేపీ నేడు రాష్ట్రంలో ఆందోళనలు చేపట్టింది.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తిరుమలలో వసతి గదుల అద్దె పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీ బీజేపీ నేడు రాష్ట్రంలో ఆందోళనలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలకు దిగింది. తిరుమలలో వసతి గదులపై పెంచిన అద్దెను వెంటనే తగ్గించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
రాజమండ్రిలో కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ఆందోళనలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమలలో వసతి గదుల అద్దె పెంపును ఆయన ఖండించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘భక్తులపై భారం పడుతున్నా టీటీడీ పట్టించుకోవడం లేదు. పెంపుపై ప్రభావం చూపే ముందు హిందూ మత సంస్థలను సంప్రదించి ఉండాలి. హిందూ దేవాలయాల్లోనే చార్జీలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాటేజీల అద్దె పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి’’ అని సోము వీర్రాజు ఇటీవల టీటీడీని కోరారు. ఈ నిర్ణయం వెనుక గల కారణాలను టీటీడీ బోర్డు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.