ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఓటర్లుగా కొందరు నకిలీ పత్రాలతో మోసం చేస్తున్నారని ఆరోపించారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారికి లేఖ రాశారు. తప్పుడు ఓటర్లను గుర్తించి వెంటనే తొలగించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
ఏపీలో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ప్రభుత్వ మద్దతుదారులలో కొంత మంది గ్రాడ్యుయేట్లుగా ఫేక్ సర్టిఫికెట్లు సమర్పిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఫేక్ గా ఓటర్ల నమోదు చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చిందని సోము వీర్రాజు తెలిపారు. తప్పుడు గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్, డమ్మీ విద్యాసంస్థల పేర్లతో సర్టిఫికెట్లు చూపించి ఓటర్ల నమోదు చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల నియమావళికి తూట్ల పొడుస్తున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. ఓటర్ల నమోదు ప్రక్రియ నిబంధనలకు లోబడి జరగాలని.. తప్పుడు ఓటర్లను వెంటనే గుర్తించి తొలగించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
అంతకుముందు శుక్రవారం ఉదయం రాజధాని అమరావతిలో పర్యటించారు సోము వీర్రాజు. ఈ సందర్భంగా రోడ్ల దుస్థితిని పరిశీలించిన ఆయన రాజధాని ప్రాంతం... అందులోనూ అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు కొలువైన ప్రాంతంలోనే రోడ్ల పరిస్థితి ఇంత అద్వాన్నంగా వుంటే ఇక సాధారణ ప్రాంతాల్లో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఎయిమ్స్ ఆసుపత్రి, విఆర్టి, ఎస్ఆర్ఎం, అమృత యూనివర్సిటీకి వెళ్లే రహదారి గుంతలమయం కావడం జగన్ ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
ALso REad:అమరావతిలో ఇదీ రోడ్ల దుస్థితి... రాజధానిలోనే ఇలా వుంటే..: జగన్ సర్కార్ పై వీర్రాజు ధ్వజం
ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు వెళ్ళే మార్గాలలో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం దారుణమని సోము వీర్రాజు దుయ్యబట్టారు. అమరావతి లో అభివృద్ధి ఆపేసి ఎడారిగా మార్చిన జగన్ ప్రభుత్వం... ఇప్పుడు తప్పులను కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోందని వీర్రాజు మండిపడ్డారు. ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించడంతో ఈ విద్యాసంస్థలు ఇక్కడ వెలిసాయని... రాష్ట్రాన్ని నమ్ముకుని వచ్చిన యాజమాన్యాలు అన్యాయానికి గురవుతున్నారని వీర్రాజు అన్నారు. కక్ష గట్టి మరీ ఈ విద్యాసంస్థలకు రహదారుల నిర్మాణం చేపట్టడం లేదని తెలిసిందన్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో మన రాష్ట్రం గురించి ఏమనుకుంటారో అని కూడా ఈ తోలు మందం ప్రభుత్వానికి పట్టడంలేదంటూ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. . పదకొండు కిలోమీటర్ల ఉన్న రోడ్ ను డబుల్ లైన్ గా అభివృద్ధి చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేసారు.
