కేవలం 48గంటల్లో ఒమిక్రాన్ నయం... ఆనందయ్య ప్రకటనపై ఆయుష్ కమీషనర్ సీరియస్, నోటీసులు జారీ
కేవలం 48గంటల్లోనే తన ఆయుర్వేద మందుతో కరోనా, ఒమిక్రాన్ ను నయం చేస్తానంటూ ప్రకటించిన కృష్ణపట్నం ఆనందయ్యకు ఆయుష్ శాఖ కమీషనర్ నోటీసులు జారీ చేసింది.
నెల్లూరు: కరోనా (corona virus)తో పాటు ఒమిక్రాన్ (omicron) ను తన ఆయుర్వేద మందుతో నయం చేస్తానని ప్రకటించిన బొణిగె అనందయ్య (bonige anandaiah)కు ఆంధ్ర ప్రదేశ్ ఆయుష్ శాఖ (ap ayush department) నోటీసులు జారీ చేసింది. చట్టవిరుద్దంగా ఒమిక్రాన్ మందు తయారీ మాత్రము కాదు ప్రచారం చేయడం కూడా నేరమని ఆయుష్ శాఖ కమీషనర్ హెచ్చరించారు. ముందస్తు అనుమతి లేకుండా మందు ఎలా తయారుచేస్తారు? ఏ ప్రమాణాలకు లోబడి తయారు చేసారు? క్లినికల్ ట్రైల్స్ ఏమన్నా నిర్వహించారా? ఆ వివరాలు ఏమన్నా ఉన్నాయా? అని ఆయుష్ కమీషనర్ నోటీసుల్లో పేర్కొన్నారు.
చట్టపరమైన అనుమతులు పొందేవరకు కరోనాతో పాటు ఒమిక్రాన్ కు ఎలాంటి మందు పంపిణీ చేయొద్దన్న ఆయుష్ కమీషనర్ హెచ్చరించారు. మందు పంపిణీ ప్రకటనపై వెంటనే వివరణ ఇవ్వాలని ఆయుష్ శాఖ కమీషనర్ ఆనందయ్యకు నోటీసులు జారీ చేసారు.
''డ్రగ్స్&కాస్మోటిక్ యాక్ట్ 1940 (drugs and cosmotic act 1940), రూల్స్ 1945 లోని రూల్ 153, రూల్ 158Bలను అనుసరించి ఒక మందు తయారీకి కొన్ని నిర్దిష్ట ప్రమాణములు నిర్దేశింబడినాయి. ఆ ప్రమాణాలకు లోబడి ముందస్తు అనుమతితోనే ఏదైనా మందు తయారీ, అమ్మకం జరపాల్సి వుంటుంది. కానీ ఆయుష్ డిపార్ట్ మెంట్ వద్దగల సమాచారం మేరకు సదరు మందుల తయారీ అనుమతి నిమిత్తం మీరు ఏ విధమైన దరఖాస్తును చేసుకోలేదు. కనుక మీ మందులను ఆయుర్వేద మందులుగా పేర్కొనడం సరికాదు. ఇది చట్టు విరుద్దం'' అని ఆనందయ్యకు అందించిన నోటీసుల్లో ఆయుష్ శాఖ పేర్కొంది.
''సెక్షన్ 4, ది డ్రగ్స్ ఆండ్ మ్యాజికల్ రెమిడీస్ (అబ్జక్షనబుల్ అడ్వర్టైజ్మెంట్) యాక్ట్ 1954 (యాక్ట్ 21 ఆఫ్ 1954) ప్రకారం ఏదేని మందు గురించి ప్రత్యక్షంగా, పరోక్షంగా గానీ ప్రజలను తప్పదోవ పట్టించే ప్రకటన చేయడం నిషిద్దం. ఒమిక్రాన్ వైరస్ ను కేవలం 48గంటల్లో బలహీరపరచగలనని మీరు చెప్పినట్లు ప్రచురితమైన వార్త ఈ చట్టానికి విరుద్దంగా ఉన్నట్లుగా తెలియుచున్నది. కావున ఒమిక్రాన్ వైరన్ 48గంటల్లో బలహీనపరచగలనని నిరూపించగలిగితే శాస్త్రీయ ఆధారాలు ఏమైనా మీ వద్ద ఉన్నయెడల వాటిని అందజేయగలరు'' అని ఆనందయ్య సూచించారు.
''తగిన అనుమతులను చట్టపరంగా పొందేవరకు ప్రస్తుతం మీరు చేయుచున్న కోవిడ్, ఒమిక్రాన్ మందుల తయారీ, పంపకం, ఎగుమతులకు సంబంధించిన అన్ని కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయవలసినదిగా అదేశించడమైనది. లేనిచో తత్సంబధించిన చట్టపరమైన చర్యలకు మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది'' అని ఆయుష్ కమీషనర్ హెచ్చరించారు.
గతంలొ కరోనా మందు మాదిరిగానే వేరియంట్కి కూడా తాను ఆయుర్వేద మందు తయారు చేశానని పంపిణీకి సిద్ధంగా ఉందని ఇటీవల ఆనందయ్య ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి భారీగా కరోనా రోగులు కృష్ణపట్నం వస్తారని భావించిన గ్రామస్తులు మందు పంపిణీకి అభ్యంతరం వ్యక్తం చేసారు.. కొవిడ్ బాధితులతో పాటు ఇతర వ్యాధిగ్రస్థులు నేరుగా గ్రామంలోకి వచ్చే అవకాశాలుండటంతో కృష్ణపట్నం గ్రామస్థులు ఆనందయ్య మందు పంపిణీ ప్రకటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు.
దీంతో ఆనందయ్య ఇంటి వద్దకు వెళ్లి మందు పంపిణీని అడ్డుకున్నారు. కొవిడ్ బాధితులు నేరుగా గ్రామంలోకి వస్తే తమ పరిస్థితి ఏమిటని నిలదీశారు. ఈ నేపథ్యంలోనే ఆనందయ్య తయారు చేసిన మందుపై ఆయుష్ కీలక ప్రకటనను చేసింది. ఈ మందుకు తమ అనుమతి లేదని గతంలోనే ప్రకటించగా తాజాగా నోటీసులు జారీ చేసారు.