చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని.. సైకిల్ గుర్తుకి బదులు పీనుగు అయితే బెటర్ : స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలు
రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొంటున్న సభల్లో వరుసగా తొక్కిసలాటలు చోటు చేసుకుంటుండటంపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ స్పందించారు. టీడీపీ సైకిల్ గుర్తు కాదు.. పీనుగు గుర్తు పెట్టుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు స్పీకర్ తమ్మినేని సీతారామ్ . చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని అని.. ఆయన మీటింగ్ పెడితే జనాలు చనిపోతున్నారని దుయ్యబట్టారు. టీడీపీ సైకిల్ గుర్తు కాదు.. పీనుగు గుర్తు పెట్టుకోవాలని తమ్మినేని సీతారామ్ సెటైర్లు వేశారు. టీడీపీ హయాంలో పింఛను కోసం అధికారులు, పార్టీ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేదన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని తమ్మినేని పేర్కొన్నారు.
ఇకపోతే.. స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదివారంనాడు తొడకొట్టి సంచలనం సృష్టించారు. ఏపీలో మరోసారి వైఎస్ జగన్ సీఎం అవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని బూర్జలో నిర్వహించిన వలంటీర్ల సమావేశంలో సీతారాం తొడకొట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి వైసీపీ విజయం సాధిస్తుందని మహిళలే భరోసా ఇస్తున్నారన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో వెళ్తున్న జగన్ పై ప్రజల్లో విశ్వాసం వెల్లివిరుస్తుందని స్పీకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ALso REad: కారణమిదీ: శ్రీకాకుళంలో తొడకొట్టిన ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం
అంతకుముందు అందరి సభలకు ప్రజలు వస్తున్నారని.. చంద్రబాబుకు క్రెడిబులిటీ లేదన్నారు తమ్మినేని. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన కర్మ అని ప్రజలు అనుకుంటున్నారని తమ్మినేని ఎద్దేవా చేశారు. ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు మరింత దిగజారుతున్నారని సీతారామ్ దుయ్యబట్టారు. ఆయనకు విలువలు, నైతికత అవసరం లేదని స్పీకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.