వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  వైఎస్ అవినాష్ రెడ్డి  పాత్ర ఉందో లేదో  సీబీఐ నిర్ధారిస్తుందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం  చెప్పారు. ఈ విషయంలో  మీడియా ప్రతినిధులు  వేసిన  ప్రశ్నలపై  తమ్మినేని సీతారాం  అసహనం వ్యక్తం  చేశారు.

శ్రీశైలం: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పారిపోతే సీబీఐ చూసుకుంటుందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు.ఆదివారంనాడు కర్నూల్ జిల్లా శ్రీశైలంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మీడియాతో మాట్లాడారు. అవినాష్ రెడ్డి పారిపోతే సీబీఐ చూసుకుంటుంది, నీకు నాకు పనేంటి అని తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలకు ఉన్న పనేంటని ఆయన ప్రశ్నించారు. ఆరోపణలు చేయడమే ప్రతిపక్షాల పనిగా ఆయన విమర్శించారు. ఏదో ఒకటి అనకపోతే ప్రతిపక్షాలకు రోజూ ఎలా గడుస్తుందని తమ్మినేని సీతారాం అడిగారు.

వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర ఏదైనా ఉంటే సీబీఐ చర్యలు తీసుకుటుందన్నారు. నీవు అడగడానికి లేదు, తాను చెప్పడానికి ఏమీ లేదని తమ్మినేని సీతారాం మీడియా ప్రతినిధులనుద్దేశించి వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎవరి పాత్ర ఉందో లేదా సీబీఐ తేలుస్తుందన్నారు. ఈ విషయమై విచారణ జరుగుతున్న విషయాన్ని తమ్మినేని సీతారాం గుర్తు చేశారు. ఇన్ని ప్రశ్నలు ఎందుకు వేస్తున్నావు నీవేమైనా సీబీఐ అధికారివా అని తమ్మినేని సీతారాం మీడియా ప్రతినిధిని ప్రశ్నించారు. నీవు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలా అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలా అని ఆయన అడిగారు.