స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్పై స్పందించారు ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెప్పినట్లుగా రాజకీయాలు దిగజారిపోయాయని తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్పై స్పందించారు ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఓ క్రిమినల్ను అరెస్ట్ చేశారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాధనాన్ని దోచుకున్న ఎంతోమందిని కూడా గతంలో అరెస్ట్ చేశారని తమ్మినేని గుర్తుచేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలుగుదేశం సభ్యులు హద్దుమీరి ప్రవర్తించారని.. ఇలా చర్యలు ప్రజలు ఉపేక్షించరని తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో విపక్ష సభ్యులు ఎంతో హుందాగా వ్యవహరించేవారని.. నరాలు తెగిపోయేలాంటి ప్రశ్నలను ప్రభుత్వంపై వేసేవారని స్పీకర్ తెలిపారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెప్పినట్లుగా రాజకీయాలు దిగజారిపోయాయని తమ్మినేని సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు.
ఇకపోతే.. మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్సీపీ నేతృత్వంలోని ప్రభుత్వమేనని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అన్నారు. 2019 ఎన్నికల కంటే ఈసారి పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు కేసులను గురించి ప్రస్తావిస్తూ.. చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు స్వయంగా తిరస్కరించిందనీ, కానీ సిగ్గులేకుండా ఆ పార్టీ నిరసనలు చేస్తోందని విమర్శించారు.
ALso Read: లవ్ లెటర్ ఇచ్చాక డేటింగే: లోకేష్కు సీఐడీ నోటీసులపై పేర్నినాని సెటైర్లు
తిరుపతి జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకునేలా పార్టీ కార్యకర్తలు సన్నద్ధం కావాలని వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, తిరుపతి జిల్లా అధ్యక్షుడు ఎన్ .రామ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. రెండు రోజుల జిల్లా సమావేశం చివరి రోజున పార్టీ కార్యకర్తలనుద్దేశించి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ 2019 ఎన్నికల కంటే ఈసారి పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో మెరుగైన పాలన అందిస్తున్నామని తెలిపారు. ప్రజలు మరోసారి తమకు మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.