స్పీకర్ తమ్మినేని సీతారాంకు జగన్ మంత్రివర్గంలో బెర్త్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన స్థానంలో మంత్రి ధర్మాన ప్రసాదరావును స్పీకర్గా పంపుతారంటూ చర్చ జరుగుతోంది. మరి జగన్ ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణ దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. వచ్చే ఎన్నికలకు బలమైన కేబినెట్తో ఆయన రంగంలోకి దిగాలని భావిస్తున్నారు. ఇప్పుడున్న మంత్రివర్గం.. తన తొలి కేబినెట్ కంటే వీక్గా వుందని ఆయన అభిప్రాయానికి వచ్చేశారు. విపక్షాలు చేసే విమర్శలకు ధీటుగా బదులిచ్చే వారు కరువయ్యారని సీఎం పలుమార్లు అసహనం వ్యక్తం చేశారు కూడా. అందుకే కొత్తగా ఎమ్మెల్సీలుగా గెలిచిన వారిలో సామాజిక సమీకరణలు పక్కనపెట్టి.. సమర్ధులైన వారిని కేబినెట్లోకి తీసుకోవాలని జగన్ భావిస్తున్నారు.
ఇదిలావుండగా.. స్పీకర్ తమ్మినేని సీతారాంకు మంత్రివర్గంలో బెర్త్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం సీఎం జగన్ను ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిశారు. గత కొంతకాలంగా తనను కేబినెట్లోకీ తీసుకోవాల్సిందిగా జగన్ను తమ్మినేని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ముఖ్యమంత్రిని స్పీకర్ కలవడంతో వైసీపీ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. తమ్మినేని సీతారాంను కేబినెట్లోకి తీసుకుంటారా అంటూ సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలపై అనర్హత విషయంపైనా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ALso REad: ఏపీలో మరోసారి కేబినెట్ పునర్వ్యవస్థీకరణ : ఆ నలుగురిపై వేటు.. మంత్రుల్లో గుబులు, జగన్ వ్యూహమేంటీ..?
తమ్మినేనిని మంత్రివర్గంలోకి తీసుకుంటే మరి స్పీకర్గా ఎవరిని నియమిస్తారన్న దానికి సమాధానంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరు వినిపిస్తోంది. సౌమ్యుడిగా పేరొందిన ధర్మాన ప్రసాదరావు ఇటీవలికాలంలో వరుసపెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో మూడు రాజధానుల ఉద్యమాన్ని ఆయన తలకెత్తుకున్నారు. ఈ క్రమంలో నోటీకి పనిచెబుతున్నారు. దీంతో ధర్మాన తీరు పార్టీకి నష్టం కలిగిస్తోందని వైసీపీ శ్రేణులు పార్టీ పెద్దల దృష్టికి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే ఆయనను స్పీకర్ పదవిలో కూర్చొబెట్టాలని జగన్ డిసైడ్ అయినట్లుగా వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మంత్రివర్గ విస్తరణ ఊహాగానాల మధ్య మంత్రి సీదిరి అప్పలరాజు శుక్రవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి రావడం ప్రాధాన్యత కలిగించింది. కేబినెట్లో మార్పు చేర్పులపై క్లారిటీ ఇవ్వడానికే సీఎంవో నుంచి అప్పలరాజుకు పిలుపొచ్చిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు తాను మంత్రిగా వున్నా.. లేకున్నా, మంత్రినే.. నేనే కాదు 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులేనంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆ కాసేపటికీ స్పీకర్ తమ్మినేని కూడా వెళ్లడంతో వైసీపీలో ఏదో జరుగుతోందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి.
ALso REad: కేబినెట్లో మార్పులపై ఊహగాహనాలు: అప్పలరాజుకు జగన్ నుండి పిలుపు
కాగా.. గతేడాది వైఎస్ జగన్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యస్ధీకరించిన సంగతి తెలిసిందే . 11 మంది పాత మంత్రులకు మరోసారి చోటు కల్పించడంతో పాటు 14 మంది కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చారు. 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్లో చోటు దక్కింది. సామాజిక సమీకరణాల పరంగా చూస్తే బీసీ-10, కాపు-4, రెడ్డి-4, ఎస్సీ-5, ఎస్టీ-1, మైనార్టీ-1కి అవకాశం కల్పించారు . అయితే మంత్రివర్గంలో చోటు దక్కని కొందరు వైసీపీ ప్రజా ప్రతినిధులు అసమ్మతి గళం విన్పిస్తున్నారు. రాజీనామాలు చేస్తామని కూడా ప్రకటించారు. ఇప్పటికే ఈ అసంతృప్త నేతలు అధికార పార్టీని చికాకు పెడుతూనే వున్నారు.
ప్రస్తుతం జగన్ కేబినెట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, బొత్స సత్యనారాయణ, విశ్వరూప్, గుమ్మనూరి జయరాం, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, నారాయణస్వామి, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్, ధర్మాన ప్రసాదరావు, రాజన్న దొర, గుడివాడ అమర్నాథ్, ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, జోగి రమేష్, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, విడదల రజని, కాకాణి గోవర్ధన రెడ్డి, ఆర్కే రోజా, ఉషా శ్రీచరణ్ మంత్రులుగా వున్నారు.