Asianet News TeluguAsianet News Telugu

ప్రభుత్వంతో అంగన్‌వాడీల చర్చలు విఫలం : సమ్మె విరమించేది లేదు.. రేపట్నుంచి ఏకంగా ఎమ్మెల్యేల ఇంటి వద్దే

ప్రభుత్వంతో నాలుగోసారి అంగన్‌వాడీల చర్చలు విఫలమయ్యాయి.  ప్రస్తుత పరిస్థితుల్లో జీతాల పెంపు సాధ్యం కాదని జగన్ సర్కార్ తేల్చేసింది. ప్రభుత్వం ఓ పక్క బుజ్జగిస్తూ.. మరోపక్క బెదిరిస్తోందని అంగన్‌వాడీలు మండిపడుతున్నారు. 

anganwadi workers decided donot stop the strike in andhra pradesh ksp
Author
First Published Dec 26, 2023, 9:59 PM IST

డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీలను బుజ్జగించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన యత్నం మరోసారి విఫలమైంది. మంగళవారం ప్రభుత్వంతో నాలుగోసారి అంగన్‌వాడీల చర్చలు విఫలమయ్యాయి.  ప్రస్తుత పరిస్థితుల్లో జీతాల పెంపు సాధ్యం కాదని జగన్ సర్కార్ తేల్చేసింది. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. అంగన్‌వాడీ డిమాండ్స్‌పై సుదీర్ఘంగా చర్చించామని.. 11 డిమాండ్లపై దృష్టి పెట్టామని ఆయన చెప్పారు. 

వేతనం పెంపుపై సమయం ఇవ్వాలని కోరామని.. సంక్రాంతి తర్వాత మరోసారి చర్చిస్తామని బొత్స పేర్కొన్నారు. ఇప్పటికే పలు డిమాండ్లు పరిష్కరించామని, గ్రాట్యుటీపై కోర్టుకు వెళ్లాలని మంత్రి సూచించారు. అంగన్‌వాడీలు సమ్మె విరమిస్తారని భావిస్తున్నామని, అంగన్‌వాడీలు సమ్మె విరమించుకుంటే మేం ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సి ఉంటుందని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. 

సమ్మె వల్ల ఇప్పటికే గర్భీణులకు పోషకాహారం ,  పిల్లలకు బాలామృతం అందడం లేదని బొత్స తెలిపారు. పోషకాహారం అందకుంటే గర్భిణులు, పిల్లలు ఏమవుతారని ఆయన ప్రశ్నించారు. సమ్మె విరమించకుంటే మేం ప్రత్యామ్నాయాలకు వెళ్లక తప్పదని.. అంగన్‌వాడీ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగానే ఉందని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. వేతనాలు పెంచాలనే ఒక్క డిమాండ్ మినహా అన్ని డిమాండ్లను తాము ఆమోదించామని వెల్లడించారు. వేతనాల పెంపునకు ఇది సరైన సమయం కాదని వివరించామని, గ్రాట్యుటీ మా పరిధిలోకి రాదని అంగన్వాడీలకు వివరించామన్నారు.

మరోవైపు.. ప్రభుత్వంతో చర్చలు విఫలమవ్వడంపై అంగన్‌వాడీ అనుబంధ సంఘాల నేతలు స్పందించారు. తాము సమ్మె వాయిదా వేసే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఓ పక్క బుజ్జగిస్తూ.. మరోపక్క బెదిరిస్తోందని అంగన్‌వాడీలు మండిపడుతున్నారు. ఇప్పటికీ మా డిమాండ్లను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్ల లేదని మంత్రి బొత్స చెప్పారు. మా సమస్యను ఇంకా సీఎం దృష్టికి తీసుకెళ్లక పోవడమేంటని వారు ప్రశ్నించారు. సీఎం దగ్గర వీళ్లు మంత్రులుగా ఉన్నారా.. లేదా..? అనే అనుమానం వస్తోందంటూ దుయ్యబట్టారు. 

సంక్రాంతి వరకు సమ్మెను వాయిదా వేస్తే సమస్య పరిష్కరిస్తామని మంత్రి చెబుతున్నారని.. 15 రోజుల్లో ప్రభుత్వానికి ఏమైనా బంగారపు గనులు వచ్చేస్తాయా అంటూ అంగన్‌వాడీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అంగన్‌వాడీల జీతాలు పెంచడానికే ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవా అని వారు నిలదీస్తున్నారు. అంగన్‌వాడీలు మానసిక వేదనకు గురవుతున్నారని, కొందరు అంగన్‌వాడీలు ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య ఐసీయూలో ఉన్నారని వారు తెలిపారు. 

బుజ్జగింపులు బెదిరింపులు తప్ప సమస్యల పరిష్కారం లేదని .. మా సమ్మెను ఉద్రిక్తం చేస్తామని వారు స్పష్టం చేశారు. రేపు అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఇంటిని ముట్టడిస్తామని.. వచ్చే నెల మూడున కలెక్టరేట్‌లను ముట్టడిస్తామని అంగన్‌వాడీలు చెప్పారు. హెల్పర్లకు అన్యాయం చేశారని, అంగన్‌వాడీ వర్కర్స్‌ను రోడ్డుపైకి తీసుకుని వచ్చారని వారు మండిపడ్డారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios