టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అంగళ్లులో పర్యటించిన సందర్భంగా అధికార వైసీపీ నేతలు నిరసన తెలిపేందుకు పోలీసుల అనుమతి ఉందా లేదా అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రశ్నించింది.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అంగళ్లులో పర్యటించిన సందర్భంగా అధికార వైసీపీ నేతలు నిరసన తెలిపేందుకు పోలీసుల అనుమతి ఉందా లేదా అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రశ్నించింది. అన్నమయ్య జిల్లా ముద్దివేడు పోలీసులు తమపై పెట్టిన కేసుల్లో ముందస్తు బెయిల్‌ కోసం టీడీపీ సీనియర్‌ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, పుల్లివర్తి నాని దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా.. ప్రతిపక్ష నేతకువినతిపత్రం ఇచ్చేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు ఎందుకు ప్రయత్నించారని జస్టిస్‌ కే సురేష్‌రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలా ఇది రెచ్చగొట్టడం కాదా? అని ప్రశ్నించారు. 

అయితే ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు బుధవారానికి (ఆగస్టు 16) వాయిదా వేసింది. అప్పటి వరకు పిటిషనర్లను అరెస్టు చేయవద్దని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించాలని అడ్వకేట్ జనరల్‌ను కోర్టు కోరింది. విచారణ సందర్భంగా సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు టీడీపీ నేతలు అనుమతి తీసుకున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ ఘటనలో సెక్షన్ 307 కింద కేసు నమోదు చేయాల్సిన పరిస్థితులు లేవని.. సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వకుండా ఉండేందుకు మాత్రమే ఈ కేసులో మిగతా అన్ని సెక్షన్లను చేర్చారని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును అభ్యర్థించారు.

పోలీసు శాఖ తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ల ప్రేరణతోనే గొడవ జరిగిందని అన్నారు. టీడీపీ నేతలు నిర్ణీత మార్గం నుంచి మళ్లించారని, వారి నాయకుడి ప్రోద్బలంతో కేడర్‌ హింసకు పాల్పడిందని తెలిపారు. అయితే దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యాజ్యంలో పిటిషనర్‌గా లేని వ్యక్తిపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.