జూన్ 10న సుప్రీంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు విచారణ
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునర్నియామకం కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై ఈ నెల 10వ తేదీన విచారణ చేపట్టనుంది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునర్నియామకం కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై ఈ నెల 10వ తేదీన విచారణ చేపట్టనుంది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హృషికేశ్ రాయ్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం దీనిపై విచారణ జరపనుంది. 10వతేది మధ్యాహ్నం 12గంటల నుంచి ధర్మాసనం కేసుల విచారణను ప్రారంభిస్తుంది.
కేసుల జాబితాలో ఈ కేసు నెంబర్ 11. ఇకపోతే... ఈ విషయంలో జస్టిస్ కనగరాజ్ను ప్రతివాదిగా చేర్చడంతో పాటు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ లేవనెత్తిన ఇతర లోపాలను రాష్ట్రప్రభుత్వం తరఫు న్యాయవాదులు ఇప్పటికే సరిదిద్దారు.
కాగా, ఈ కేసులో నిర్ణయం తీసుకునేముందు తమ వాదన కూడా వినాలంటూ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, టీడీపీ నేత వర్ల రామయ్య, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, బీజేపీ నేత, మాజీమంత్రి కామినేని శ్రీనివాస్, న్యాయవాది కే జితేంద్రబాబు ఇప్పటికే కేవియెట్ పిటిషన్ లను దాఖలు చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టాన్ని మారుస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్సును హై కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఆ ఆర్డినెన్సును కొట్టేయడంతో కనగరాజ్ నియామకం, రమేష్ కుమార్ తొలగింపు చెల్లవని ప్రకటించింది.
ఇకపోతే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై రమేష్ కుమార్ విషయంలోతాజాగా ఫైరయ్యారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి. గత మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎస్ఈసీగా ఉంటే, ఈసీ స్వతంత్రంగా పనిచేయదని విజయసాయి ఆరోపించారు.
దీనిలో భాగంగా ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుందన్నారు. నిమ్మగడ్డ పదవి నుంచి దిగిపోయారని, చంద్రబాబు రెండు డజన్ల అడ్వొకేట్లను రంగంలోకి దింపారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. నిమ్మగడ్డ కోసం టీడీపీ అధినేత ఎందుకు అంత హైరానా పడుతున్నారోనని విజయసాయి సెటైర్లు వేశారు.