జగన్ సర్కార్ కు హైకోర్ట్ లో షాక్... రివ్యూ పిటిషన్ కొట్టేసిన ధర్మాసనం
జగనన్న విద్యాదీవెన విషయంలో వైసిపి ప్రభుత్వం దాఖలుచేసిన రివ్యూ పిటిషన్ ను కొట్టివేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీర్పునిచ్చింది.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు (AP High Court) మరో షాక్ తగిలింది. జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనే నగదు జమచేయాలని ప్రభుత్వం (ysrcp government) నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రైవేట్ కాలేజీల యాజామాన్యాలు హైకోర్టును ఆశ్రయించగా వారికి అనుకూలంగా గతంలోనే హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా దాన్నికూడా ఇవాళ హైకోర్టు కొట్టేసింది.
గతంలో జగనన్న విద్యాదీవెన పథకం (jaganna vidyadeevena scheme) కింద అందించే నగదును విద్యార్థుల తల్లుల ఖాతాలోనే జమచేయాలని వైసిపి ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రైవేట్ యాజమాన్యాల తరపున కృష్ణదేవరాయ యూనివర్సిటీ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ప్రభుత్వ ఉత్తర్వులను కోటివేస్తూ తుది తీర్పు ఇచ్చింది.
దీంతో హైకోర్టు ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించగా విద్యాసంస్థల యాజమాన్యాల తరపున న్యాయవాదులు మతుకుమిల్లి విజయ్, వెదుల వెంకటరమణ వాదనలు వినిపించారు.
ఇవాళ(సోమవారం) రివ్యూ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ కొంగర విజయలక్ష్మి ధర్మాసనం ఇరు పక్షాల వాదనలు విన్నారు. ఈ క్రమంలోనే మరోసారి వైసిపి సర్కార్ కు షాకిస్తూ రివ్యూ పిటిషన్ ను కూడా కొట్టేస్తూ తుది తీర్పు ఇచ్చారు. విద్యాదీవెన పథకం కింద ఇచ్చే నగదును తల్లుల ఖాతాల్లో కాకుండా విద్యాసంస్థలకు జమ చేయాలని ఆదేశించారు.
జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా పూర్తి స్థాయిలో విద్యార్థులకు ఫీజు రియింబర్స్ మెంట్ అందిస్తోంది వైసిపి ప్రభుత్వం. ప్రతి ఒక్క విద్యార్ధిని వంద శాతం గ్రాడ్యుయేట్లుగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని... ఫీజు కట్టలేని పరిస్థితి ఏ విద్యార్థికి రావద్దంటూ సీఎం జగన్ విద్యాదీవెన పథకాన్ని తీసుకువచ్చారు. మొదటి విడత కింద ఈ ఏడాది ఏప్రిల్ 19న, రెండో విడత కింద ఈ ఏడాది జూలై 29న, నవంబర్ లో మూడో విడత కింద నిధులను పంపిణీ చేశారు. వచ్చే ఏడాది (2022సంవత్సరం) ఫిబ్రవరి మాసంలో నాలుగో విడత నిధులను ఇవ్వనున్నట్లు ఇప్పటికే జగన్ సర్కార్ ప్రకటించారు.
గతంలో విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్ అకౌంట్లలో విద్యాదీవెన నగదు జమ అయ్యేవి. అయితే ఈ డబ్బులను విద్యార్థుల తల్లుల ఖాతాలో వేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ప్రతీ మూడు నెలలకోసారి ఫీజు చెల్లించడానికి కాలేజీలకు నేరుగా వెళ్ళి వారి పిల్లల చదువులు, కాలేజీలలో వసతులు పరిశీలించే అవకాశం తల్లిదండ్రులకు వుంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింద అయితే తల్లులు ఫీజు చెల్లించకపోతే తమకు సంబంధం లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రైవేట్ విద్యాసంస్థల యాజామాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో విచారణ జరిపిన న్యాయస్థానం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలను అనుకూలంగా తీర్చునిచ్చింది.