నేడే టిడిపి-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల... ప్రధాన హామీలివే..?
ఇవాళ(సోమవారం) టిడిపి, జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదలచేసే అవకాశాలున్నాయి. అధికారంలోకి వస్తే ఏం చేయనున్నారో ఈ మేనిఫెస్టో ద్వారా ఎన్నికలకు ముందు ప్రజలకు వివరించనున్నారు.
![Andhra Pradesh Electon 2024 : TDP Janasena alliance joint manifesto Finalised AKP Andhra Pradesh Electon 2024 : TDP Janasena alliance joint manifesto Finalised AKP](https://static-ai.asianetnews.com/images/01hm3a02xm8y6y2djwwzmj6yh9/whatsapp-image-2024-01-14-at-10-51-41-am-jpg_363x203xt.jpg)
అమరావతి : తెలుగుదేశం, జనసేన పార్టీలు ఎన్నికలకు సంసిద్దం అవుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో వైసిపి ఓడించి గద్దె దించడమే లక్ష్యంగా ఇరుపార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనకు ఇరు పార్టీల నాయకులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటుచేసారు. ఆ కమిటీ ఇప్పటికే పలుమార్లు సమావేశమై మేనిఫెస్టో రూపకల్పనపై కసరత్తు పూర్తిచేసింది. ఈ క్రమంలోనే ఇవాళ ఈ మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
టిడిపి, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో జనసేన పార్టీ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించే అంశాలను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. 'ప్రతీ చేతికి పని - ప్రతీ చేనుకీ నీరు' అనే నినాదంతో జనసేన మేనిఫెస్టోలో అంశాలను ప్రతిపాదించింది. యువతకు ఉద్యోగ కల్పన, ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి ప్రోత్సాహకాలకు జనసేన పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్దిని కూడా జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చినట్లు తెలుస్తోంది.
ఇక టిడిపి-జనసేన కూటమి అధికారంలోకి వస్తే వ్యవసాయానికి పెద్దపీట వేయనున్నట్లు ఈ మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు సమాచారం. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, రైతుల సంక్షేమం, సాగునీటి సమస్య నివారణ, కౌలు రైతుల భద్రతపై మేనిఫెస్టోలో హామీ ఇవ్వనున్నారు.
ఇక తెలుగుదేశం పార్టీ పేదరికాన్ని నిర్మూలించేందుకు ఏం చేయనున్నారో ఈ మేనిఫెస్టో ద్వారా స్పష్టమైన హామీ ఇవ్వనుంది. పేదలను సంపన్నులను చేసేందుకు ప్రయత్నించనున్నట్లు ఇప్పటికే ప్రకటించగా... రాబోయే ఐదేళ్ళలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా టిడిపి-జనసేన ప్రభుత్వం పనిచేస్తుందని మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు సమాచారం. ఇక బిసిల రక్షణకు ప్రత్యేక చట్టం తెచ్చి వారికి అన్నివిధాల అండగా వుండనున్నట్లు టిడిపి హామీ ఇవ్వనుంది.
అధికారంలోకి రాగానే "ఇంటింటికీ మంచి నీరు" పథకం కింద ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇవ్వనున్నట్లు ఇప్పటికే టిడిపి ప్రకటించింది. దీన్ని మేనిఫెస్టోలో పొందుపర్చినట్లు సమాచారం. అలాగే అన్నదాత పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించనున్నట్లు టిడిపి హామీ ఇవ్వనుంది.
మహాశక్తి పేరిట మహిళల కోసం ప్రత్యేక పథకాలను రూపొందించనున్నట్లు టిడిపి హామీ ఇచ్చింది. కుటుంబంలో 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకు "స్త్రీనిధి" కింద నెలకు 1500 రూపాయలు అందించనున్నట్లు టిడిపి హామీ ఇచ్చింది. అలాగే 'తల్లికి వందనం' పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించారు. ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.15,000లు అందించనున్నట్లు టిడిపి ప్రకటించింది. వీటిడి ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపర్చినట్లు సమాచారం.
ఇక "దీపం" పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని టిడిపి హామీ ఇచ్చింది. అలాగే మహిళలకు 'ఉచిత బస్సు ప్రయాణం' పథకాన్ని కూడా టిడిపి ప్రకటించింది. రాష్ట్రంలోని నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలిస్తామని... ప్రతి నిరుద్యోగికి 'యువగళం నిధి' కింద నెలకు రూ.2500 రూపాయలు ఇవ్వనున్నట్లు టిడిపి హామీ ఇచ్చారు. వీటన్నింటిని ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపర్చిట్లు తెలుస్తోంది.