ఏపీ రాజధాని అమరావతి: జగన్ కు కేంద్రం షాక్
Andhra Pradesh: కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వానికి నిరాశను కలిగిస్తూ కేవలం ఒక్క రాజధానికే నిధులు కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేస్తూ.. ఈ నెల 27న జరిగే విభజన అంశాల ఏజెండాలో పేర్కొంది.
Amaravati: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైకాపా సర్కారు మొదటి నుంచి మూడు రాజధానులకే మొగ్గుచూపుతోంది. ఇదివరకే అన్ని అంశాలను ప్రస్తావిస్తూ మూడు రాజధానులను కూడా ప్రకటించింది. అయితే, రాజధాని అంశం కోర్టుకు చేరుకోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. మూడు రాజధానుల ఉత్తర్వులు రద్దు చేయబడ్డాయి. అయితే, మరోసారి వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో ముందుకు సాగాలని నిర్ణయం తీసుకుంటూ.. దానికి కావాల్సిన అన్ని అడ్డంకులను తొలగించుకోవాలని ప్రాణాళికలు సైతం సిద్దం చేసుకున్నట్టు సంకేతాలు పంపింది. ఈ పనులు సజావుగా ముందుకు సాగితే అధికారికి గెజిట్ వెలువడవచ్చు.
ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వానికి నిరాశను కలిగిస్తూ మరో నిర్ణయం తీసుకుంది. కేవలం ఒక్క రాజధానికే నిధులు కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేసింది. దీంతో మూడు రాజధానుల అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకెళ్తే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా కేంద్ర ప్రభత్వం రెండు రాష్ట్రాలకు సంబంధించి పలు హామీలు ఇచ్చింది. అయితే, ఇప్పటికీ ఆ హామీల నెరవేరకపోవడంతో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు పోరాటం సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన అంశాలపై చర్చలు జరపనుంది. రాష్ట్ర విభజన అంశాలపై ఈనెల 27న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చర్చకు సంబంధించిన ఏజెండాను ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన అంశాలపై చర్చలకు సంబంధించిన ఏజెండాలో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. విభజన చట్టం ప్రకారమే కేంద్ర సహకారం రాజధాని విషయంలో ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే, ఒక్క రాజధాని అని మాత్రమే పేర్కొంటూ.. మూడు రాజధానుల ప్రస్తావన తీసుకురాలేదు. కేంద్ర ఈ ఏజెండాలో మూడు రాజధానుల విషయం గురించి ప్రస్తావించకపోవడం.. జగన్ సర్కారుకు షాక్ అని చెప్పాలి. ఎందుకంటే మొదటి నుంచి వైకాపా సర్కారు మూడు రాజధానుల వైపే మొగ్గుచూపుతోంది. త్వరలోనే జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఇదివరకు కోర్టు రద్దు చేసిన బిల్లు స్థానంలో మరో కొత్త బిల్లును తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో కేంద్ర ఒక్క రాజధానికే సహకారం అనే అంశం ఏపీ సర్కారుకు షాక్ అని చెప్పాలి.
ఈ చర్చలో కొత్త రాజధాని నగరం నుంచి ర్యాపిడ్ రైల్ అనుసంధానం అంశాన్ని కూడా కేంద్రం పేర్కొంది. అలాగే, తెలంగాణ, ఏపీల మధ్య పరిష్కారం కావాల్సిన అంశాలు ఉన్నాయి. వాటిలో షెడ్యూల్ 9లో పేర్కొన్న.. ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. అలాగే, షెడ్యూల్ 10 పేర్కొన్న రాష్ట్ర సంస్థల విభజనలు ఉన్నాయి. అలాగే, ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ కార్పొరేషన్, సింగరేణి కాలరీస్, ఆంధ్రప్రదేశ్ హెవీ మెషినరీ ఇంజనీరింగ్, ఆర్థిక లావాదేవీలు అంటే నగదు, రుణాలు కూడా ఉన్నాయి. విద్యుత్ బకాయిలు కూడా ఉన్నాయి. గత కొంత కాలంగా రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల అంశం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈనెల 27న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సమావేశంలో ఈ అంశాలపై చర్చించనున్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు ఇందులో పాలుపంచుకోనున్నారు.