ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో బీసీ మంత్రులు గురువారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నేతలు.. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ చైతన్య పర్యటనలు, సమావేశాలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశాల మేరకు రూట్ మ్యాప్ ఖరారు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో బీసీ మంత్రులు గురువారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నేతలు.. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ చైతన్య పర్యటనలు, సమావేశాలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశాల మేరకు రూట్ మ్యాప్ ఖరారు చేశారు. అనంతరం బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ.. బీసీలకు సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు, జరిగిన మేళ్లను నేతలంతా కలసి చర్చించామని చెప్పారు. 139 బీసీ కులాలు ఉంటే 56 కార్పోరేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.
బీసీల ఆత్మగౌరవం కోసం వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సదస్సులు చేపట్టాలని నిర్ణయించినట్టుగా వెల్లడించారు. బీసీల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. తొలుత అన్ని కొత్త జిల్లాల్లో బీసీ ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నట్టుగా తెలిపారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో బీసీ సదస్సు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
31వేల కోట్ల రూపాయలను బీసీ సబ్ ప్లాన్ కోసం ప్రభుత్వం కేటాయించిందని మత్రి చెప్పారు. బీసీలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారనే విషయాన్ని క్షేత్ర స్థాయికి తీసుకెళతామని తెలిపారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి సహా తాను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి బీసీ నేతలు, ప్రజలను సమాయత్తం చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఏప్రిల్ నెల 15 తర్వాత నెల పాటు పర్యటనలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించారు.
బీసీల సమస్యలను గుర్తించి నెరవేర్చేలా క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తామని చెప్పారు. బీసీలకు చేసిన మంచిని ప్రజలకు తెలియజేయడం, లోపాలను సవరించడమే సదస్సుల నిర్వహణ ముఖ్య లక్ష్యమని వివరించారు.
గతంలో పాలించిన టీడీపీ హయాంలో విద్యుత్ చార్జీలు పెంచలేదా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకాలను చంద్రబాబు తీసివేయలేదా అని అడిగారు. గతంలో విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం వేసింది తెలుగుదేశం పార్టీనే అని విమర్శించారు. ప్రజలను ఏదో విధంగా దృష్టి మరల్చడమే టీడీపీ లక్ష్యమని అన్నారు. ఏ ప్రభుత్వం మంచి చేస్తుందో ..ఆదుకుంటుందో అనే విషయం ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు.
