ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఎన్నికల ఫలితాల ప్రకటనపై అడ్డంకి తొలగింది. దీంతో ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మరోసారి అరబిందో కంపెనీ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఎన్నికల ఫలితాల ప్రకటనపై అడ్డంకి తొలగింది. దీంతో ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మరోసారి అరబిందో కంపెనీ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఎన్నిలకు మాజీ ఐఏఎస్ రమకాంత్ రెడ్డి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా శరత్ చంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడిగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి, కార్యదర్శి పదవికి ఎస్ఆర్ షాపింగ్ మాల్ అధినేత గోపినాథ్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా రాకేష్, కోశాధికారిగా వెంకటాచలం, కౌన్సిలర్గా పురుషోత్తమ రావు నామినేషన్ వేశారు.
అయితే ఆయా పదవుల కోసం ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో వారంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఫలితాలను డిసెంబర్ 3వ తేదీన ప్రకటించాల్సి ఉండగా.. చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఏసీఏ ప్రస్తుత ప్రెసిడెంట్ శరత్ చంద్రారెడ్డిపై అనర్హత వేటు వేయాలని ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. లోధా కమిటీ, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు మరియు సిఫార్సులను పాటించకుండా జరిగిన ఏసీఏ ఎన్నికలను సవాలు చేసింది. ఇందుకు సంబంధించి ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 14కి వాయిదా వేసింది.
అయితే తాజాగా చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ పిటిషన్ను వెనక్కి తీసుకోవడంతో.. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఎన్నికల ఫలితాల ప్రకటనకు అడ్డంగి తొలగింది. ఫలితాలను ప్రకటించేందుకు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఉత్తర్వులు జారీచేశారు.
