Amaravati Padayatra: పోలీసులు లారీచార్జ్లో విరిగిన రైతు చేయి.. వర్షంలోనూ కొనసాగుతున్న అమరావతి రైతుల పాదయాత్ర
అమరావతి రైతులకు మద్దతుగా వారు చేపట్టిన మహా పాదయాత్రలో (Amaravati Padayatra) పాల్గొనేందుకు పెద్దఎత్తున వస్తున్న ప్రజలను పోలీసులు అడ్డుకుంటున్నారు. అయినప్పటికీ పోలీసులను తోసుకుంటూ ప్రజలు యాత్రలో పాల్గొంటున్నారు. మరోవైపు రైతుల పాదయాత్రకు ఆంక్షలు విధించిన పోలీసులు ఎక్కడికక్కడ చెక్పోస్ట్లను ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్కు అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన న్యాయస్థానం నుంచి దేవస్థానం మహా పాదయాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న అమరావతి రైతుల పాదయాత్రలో (Amaravati Padayatra) ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాలు.. అమరావతి రైతులు పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ పెద్ద ఎత్తున ప్రజలు, కాంగ్రెస్, టీడీపీ, బీజీపీ, సీపీఐ నేతలు కూడా ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కోడ్ (model code of conduct) అమల్లో ఉన్నందున పాదయాత్రలో ఇతరులు పాల్గొన కూడదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అనుమతి పొందిన రాజధాని ప్రాంతానికి చెందిన 157 మంది రైతులు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని పోలీసులు తెలిపారు. ఈ మేరకు అమరావతి జీఏసీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ఇదిలా ఉంటే Amaravati రైతులకు మద్దతుగా వారు చేపట్టిన మహా పాదయాత్రలో పాల్గొనేందుకు పెద్దఎత్తున వస్తున్న ప్రజలను పోలీసులు అడ్డుకుంటున్నారు. అయినప్పటికీ పోలీసులను తోసుకుంటూ ప్రజలు యాత్రలో పాల్గొంటున్నారు. మరోవైపు రైతుల పాదయాత్రకు ఆంక్షలు విధించిన పోలీసులు ఎక్కడికక్కడ చెక్పోస్ట్లను ఏర్పాటు చేశారు. దీంతో ఆంక్షల నడుమే అమరావతి రైతలు పాదయాత్ర కొనసాగుతుంది.
అయితే ప్రకాశం జిల్లా చదలవాడ వద్ద పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన రైతులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీంతో పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే సంతనూతలపాడుకు చెందిన రైతు నాగార్జున చేయి విరిగింది. దీంతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై అమరావతి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వర్షంలోనూ కొనసాగుతున్న పాదయాత్ర..
అమరావతి రైతులు, మహిళలు వర్షంలోనూ తమ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. రాత్రిపూట వారు బసచేసిన నాగులుప్పలపాడులో ఆకాల వర్షం కారణంగా గుడారాలు తడిచిపోయి తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. గురువారం 11వ రోజు వర్షంలోనే నాగులుప్పలపాడు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. గొడుగులు, రెయిన్ కోట్లు ధరించి పాదయాత్రను ముందుకు తీసుకెళ్తున్నారు.
Also read: Amaravati Maha Padayatra: ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎఫెక్ట్... అమరావతి రైతులకు పోలీసుల నోటీసులు (వీడియో)
సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా.. అమరావతి ప్రాంత రైతులు, మహిళలు పోరాటం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోవాలని.. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు ఉద్యమ కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే న్యాయస్థానం నుంచి దేవస్థానం మహా పాదయాత్ర చేపట్టానలి అమరావతి రైతులు నిర్ణయించారు. అయితే ఇందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. రైతుల తరఫు వాదనలతో ఏకీ భవించిన కోర్టు.. పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది.
దీంతో రైతులు నవంబర్ 1వ తేదీన మహా పాదయాత్రను ప్రారంభించారు. 45 రోజుల పాటు న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో ఈ పాదయాత్ర సాగనుంది. తుళ్లూరు నుంచి తిరుపతి వరకు కొనసాగనుంది. నవంబరు 1 నుంచి డిసెంబరు 17 వరకు సాగేలా షెడ్యూల్ ఖరారు చేశారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా సాగనుంది. రైతుల పాదయాత్రకు టీడీపీ, కాంగ్రెస్.. పార్టీలు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.