జగన్ మరో జన్మ ఎత్తినా... ఆ పేరు తెచ్చుకోలేరు..: మాజీ మంత్రి ఆలపాటి
సీఎం జగన్ అడుగడుగున రైతులకు అన్యాయం చేస్తూనే మరోవైపు వందల కోట్లతో తప్పుడు ప్రకటనలతో దగా చేస్తున్నాడని...ఇలా జగన్ రెడ్డి రైతు ద్రోహిగా చరిత్రలో మిగిలిపోయారన్నారు మాజీ మంత్రి ఆలపాటి.
అమరావతి: నేను రైతు అని గర్వంగా చెప్పుకోలేని ధీన స్థితిలోకి అన్నదాతలను సీఎం జగన్ రెడ్డి దిగజార్చారని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శించారు. అడుగడుగున రైతులకు అన్యాయం చేస్తూనే మరోవైపు వందల కోట్ల తప్పుడు ప్రకటనలతో దగా చేస్తున్నాడని...ఇలా జగన్ రెడ్డి రైతు ద్రోహిగా చరిత్రలో మిగిలిపోయారన్నారు. ఆయన మరో జన్మ ఎత్తినా రైతు బాంధవుడు కాలేడని ఆలపాటి మండిపడ్డారు.
''ఉచిత పంటల బీమా పేరుతో ఇచ్చింది గోరంత.. ప్రచారం కొండంత చేసుకుంటున్నారు. ప్రకటనలకు పెట్టే ఖర్చులో 10శాతం కూడా రైతులకు చెల్లించడం లేదు. 2020 ఏడాది ఖరీఫ్ లో 7 తుఫాన్లతో 37 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగి రూ.15 వేల కోట్లు నష్టపోతే జగన్ రెడ్డి ప్రభుత్వం కేవలం 1820.23 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు'' అని ఆరోపించారు.
''పండించిన పంటకు మద్ధతు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అలంకారప్రాయంగా మార్చేశారు. రైతులకు బేడీల వేసిన ముఖ్యమంత్రి రైతులకు న్యాయం చేస్తారని ఆశించడం అత్యాశే అవుతుంది'' అని మాజీ మంత్రి ఆలపాటి అన్నారు.
read more బిసి జనార్ధన్ రెడ్డి అరెస్ట్ సుప్రీంకోర్టుకు..: చంద్రబాబు వెల్లడి
మరో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా రైతులను జగన్ సర్కార్ పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల్లోనూ అన్నీ అబద్ధాలేనని... బూటకపు లెక్కలు చెబుతూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. రైతులు రూ.15 వేల కోట్ల మేర పంట నష్టపోతే జగన్ రెడ్డి ఇస్తున్నది నామమాత్రమేని తెలిపారు.
''ఏడు తుఫానుల్లో 37 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కానీ పంటల బీమా ఇస్తున్నది 15.15 లక్షల మంది రైతులకు మాత్రమే. ఇలా రైతులను దగా చేస్తున్న విషయాన్ని కప్పిపెట్టుకోవడానికి ప్రకటనల హవా సాగిస్తున్నారు'' అని ఆరోపించారు.
''ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించకుండానే చెల్లించినట్లు జగన్ రెడ్డి ఏకంగా అసెంబ్లీలోనే అబద్ధం చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఇతర టిడిపి నాయకులు నిలిదీసిన తర్వాత అదే రోజు రాత్రి రూ.590 కోట్లు ప్రీమియం కోసం జీవో విడుదల చేశారు. కాబట్టి ఇలాంటి మోసపూరిత విధానాలు విడనాడి కష్టాల్లో ఉన్న అన్నదాతలను ఆదుకోవాలి'' అని సోమిరెడ్డి సూచించారు.