అందుకే వైఎస్ భారతిపై ఈడీ కేసు: ఆదినారాయణ రెడ్డి
నేరం రుజువు కావడం వల్లనే వైఎస్ భారతిపై ఈడీ కేసు నమోదు చేసిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు.
అమరావతి: నేరం రుజువు కావడం వల్లనే వైఎస్ భారతిపై ఈడీ కేసు నమోదు చేసిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. అవగాహన లేకుండా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పత్రికలను తప్పుడు పడుతున్నారని ఆయన శనివారనాడు అన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, పవన్ కల్యాణ్ కు అవగాహన లేదని ఆయన అన్నారు. వారిద్దరు రాష్ట్ర రాజకీయాల్లో ఉండడం మన దౌర్భాగ్యమని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపికి ఎవరితోనూ పొత్తులు అవసరం లేదని అన్నారు.
అక్రమాస్తుల కేసులో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటే జగన్ చంద్రబాబును తప్పు పడుతున్నారని మరో మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. ఈడీ జగన్ ఆస్తులను జప్తు చేసింది నిజం కాదా అని అడిగారు. తప్పు చేసిన పది కంపెనీల్లో జగన్, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారని ఆయన అన్నారు.
వ్యవస్థలను తప్పు పడుతూ జగన్ అధికారులను బెదిరిస్తున్నారని ఆయన విమర్శించారు. మీరు, మీ కుటుంబ సభ్యులు జైలుకు వెళ్లింది నిజం కాదా అని మంత్రి అడిగారు. జగన్ ఊసరవెల్లి రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు.