49 మంది వైసీపీ ఎమ్మెల్యేలు వేరే పార్టీతో టచ్లో ఉన్నారు.. సినీ నటుడు శివాజీ సంచలనం..
సినీ నటుడు శివాజీ (Actor Sivaji) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని అన్నారు. సీఎం జగన్ పాలన వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు నచ్చడం లేదని ఆరోపించారు.
సినీ నటుడు శివాజీ (Actor Sivaji) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని అన్నారు. తలకిందులుగా తపస్సు చేసిన గెలవడం అసాధ్యమని జోస్యం చెప్పారు. రాజధానిపై హైకోర్టు తీర్పు చూశాకైనా సీఎం జగన్ తన పద్దతి మార్చుకోవాలని అన్నారు. తొలి నుంచి ఏపీకి అమరావతి ఒక్కటే రాజధాని అని చెబుతన్న శివాజీ.. గురువారం రాజధాని అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం మందడంలో రైతులు నిర్వహించిన విజయోత్సవ సభలో శివాజీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవడం కష్టమేనని అన్నారు. పులివెందులలో జగన్కు కూడా క్లిష్ట పరిస్థితులు తప్పవని చెప్పుకొచ్చారు. అక్కడ జగన్ గెలవాలంటే గట్టిగా ప్రయత్నించాల్సిందేనని వఅన్నారు. ఓటుకు రూ. 50 వేలు ఇచ్చినా రాష్ట్రంలో ఈసారి వైసీపీ గెలిచే పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తాను, తన మనుషులు తిరుగుతున్నారని చెప్పారు.
వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో వెల్లడిస్తానని దసరా తర్వాత వెల్లడిస్తానని శివాజీ తెలిపారు. ఏయే అంశాలపైన ప్రజలు రియాక్ట్ అయ్యారో కూడా చెబుతానని అన్నారు. వైసీపీకి చెందిన 49 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు వేరే పార్టీలతో టచ్లో ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. జగన్ పాలన ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు నచ్చడం లేదని ఆరోపించారు.
సీఎం జగన్ 100 తప్పులు చేసేశారని విమర్శించారు. ఇప్పటికైనా అమరావతిని అభివృద్ది చేయాలని డిమాండ్ చేశారు. 29 గ్రామాల ప్రజలు రాజధాని నిర్మాణం కోసం పని చేయడానికి సిద్దంగా ఉన్నారని తెలిపారు. సీఎం జగన్ ఇప్పటికైనా మారాలని డిమాండ్ చేశారు. వ్యాపారులు రాజకీయాల్లోకి రావడం వల్లే అమరావతికి ఈ పరిస్థితి దాపురించిందన్నారు. వారు రాజకీయాలకు దూరంగా ఉంటే ఎలాంటి సమస్యలు ఉండవన్నారు. జై అమరావతి, జై మహిళ శక్తి అంటూ నినాదాలు చేశారు.