చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్పై వాదనలు పూర్తి.. తీర్పు ఎప్పుడంటే..
లుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హౌస్ కస్టడీ పిటిషన్పై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి.

విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హౌస్ కస్టడీ పిటిషన్పై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. చంద్రబాబు హౌస్ కస్టడీకి అనుమతించాలని ఆయన తరఫును సుప్రీం కోర్టు న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు. చంద్రబాబు హోదా, వయసు రీత్యా హౌస్ రిమాండ్ ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు తీర్పులను ప్రస్తావించారు. చంద్రబాబు హౌస్ కస్టడీకి అనుమతించాలిన న్యాయమూర్తిని కోరారు. మరోవైపు సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, స్పెషల్ జీపీ వివేకానంద వాదనలు వినిపించారు.
చంద్రబాబుకు ఇంట్లో కంటో జైలులో భద్రత ఉంటుందని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని పేర్కొన్నారు. జైలులో చంద్రబాబుకు పూర్తి స్థాయి భద్రతను కల్పించినట్టుగా చెప్పారు. జైలు లోపల, బయట పోలీసుల భద్రత ఉందని తెలిపారు. అవసరమైతే వైద్య సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పును చంద్రబాబు కేసుకు ముడిపెట్టవద్దని అన్నారు. చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ డిస్మిస్ చేయాలని కోరారు.
అయితే ఇరుపక్షాల వాదనల అనంతరం ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. సాయంత్రం 4.30 గంటలకు చంద్రబాబు హౌస్ రిమాండ్పై తీర్పు వెలువడనుంది.
ఇక, చంద్రబాబు నాయుడు పిటిషన్పై సీఐడీ కౌంటర్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అందులో.. హౌస్ అరెస్ట్కు అనుమతించాలన్న చంద్రబాబు పిటిషన్ను సీఐడీ వ్యతిరేకించింది. సీఆర్పీసీలో హౌస్ అరెస్ట్ అనేదే లేదని తెలిపింది. హౌస్ అరెస్ట్ అడుగుతున్న చంద్రబాబు.. బెయిల్ పిటిషన్ కూడా వేయలేదని పేర్కొంది. అరెస్ట్ సమయంలో చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపింది. చంద్రబాబును హౌస్ అరెస్ట్కు అనుమతిస్తే కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొంది. కోర్టు ఆదేశాల ప్రకారం జైలులోనే చంద్రబాబుకు అన్నివసతులు కల్పించామని తెలిపింది. మరో రెండు కేసుల్లో కూడా చంద్రబాబు నిందితుడిగా ఉన్నారని చెప్పింది.