సారాంశం

బెట్టింగ్ కు బానిసై ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగాన్ని కోల్పోయాడు. అప్పులు చేసి, దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. గత నెల 18వ తేదీన కూడా ఓ చోరీకి పాల్పడ్డాడు. దీనిపై దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు.. నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. 

అతడు ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ నుంచి డిగ్రీ పట్టా పొందాడు. ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేశాడు. ఈ క్రమంలో అతడు బెట్టింగ్ లో డబ్బులు పెట్టడం మొదలుపెట్టాడు. తరువాత దానికి బానిసయ్యాడు. అందులో డబ్బులు పెట్టేందుకు అప్పులు చేయడం మొదపెట్టాడు. చివరికి దొంగగా కూడా మారాడు. మొదట తన మేనత్త ఇంట్లోనే దొంగతనం చేసి, చివరికి ఇప్పుడు జైలు పాలయ్యాడు. బెట్టింగ్ వ్యసనం మనిషిని ఏ స్థాయికి దిగజారుస్తుందో తెలిపే ఘటన ఇది. 

‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బలగ హరిబాబును దొంగతనం కేసులో రాజాం పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి బైక్, బంగారు ఆభరణాలు స్వాదీనం చేసుకున్నారు. హరిబాబు ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పట్టా పొందాడు. గతంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసిన హరిబాబు బెట్టింగ్ కు బానిసై ఉద్యోగం కోల్పోయాడు. మొదట తన మేనత్త ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. ఆ తర్వాత పలు చోరీ కేసుల్లో ఇరుక్కున్నాడు.

పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు, వేలిముద్రలు దొరక్కుండా ఉండేందుకు సాక్సులను గ్లౌజులుగా ఉపయోగించేవాడు. ఉద్యోగం పోయే ముందు పలువురి వద్ద అప్పులు తీసుకున్నాడు. తన సన్నిహితుల వద్ద నుంచి సుమారు రూ.6 లక్షలు అప్పు చేశారని రాజాం సీఐ రవి కుమార్ తెలిపారు. గతంలో ఓ కేసులో ఎచ్చెర్ల పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. 85 రోజుల జైలు జీవితం తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. 

కాగా.. గత నెల 18న రాజాం పట్టణంలోని వాసవీనగర్ లోని ఓ టీచర్ ఇంట్లో బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదు చోరీ చేశాడు. తిరిగి తన ఇంటికి వస్తుండగా డ్రైనేజీలో జారిపడ్డాడు. దీంతో ప్యాంటుకు బురద, నీళ్లు అంటుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ టీచర్ ఇంటికి వెళ్లి వార్డ్ రోబ్ లో ఉన్న ట్రాక్ సూట్ వేసుకున్నాడు. అయితే తన ప్యాంటును బాధితురాలి ఇంట్లో వదిలేశాడు. తరువాత బంగారు ఆభరణాలను ప్రైవేట్ ఫైనాన్స్ బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు. ఈ చోరీపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు చివరికి నిందితుడిని అరెస్టు చేశారు.