సెల్ఫీ తీసుకుందామంటూ...సహజీవనం చేసిన మహిళ కుటుంబాన్ని నదిలోకి తోసేశాడో వ్యక్తి. తల్లి, చెల్లి నదిలో పడిపోగా 13 యేళ్ల బాలిక పైప్ పట్టుకుని ప్రాణాలు దక్కించుకుంది.  

గుంటూరు : నమ్మించి నట్టేట ముంచాడు ఓ వ్యక్తి. సహజీవనం చేస్తూ ఆ కుటుంబాన్ని గోదాట్లోకి తోసాడు. అయితే ఓ 13 ఏళ్ల బాలిక మాత్రం అత్యంత సమయస్ఫూర్తితో తనను తాను రక్షించుకుంది. ఉధృతంగా పారుతున్న గోదావరి పైనున్న బ్రిడ్జి మీది నుంచి నదిలోకి పడిపోతూ కేబుల్ పైపులు పట్టుకుని ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే…

గుంటూరు జిల్లా తాడేపల్లి కి చెందిన పుప్పాల సుహాసిని(36). ఆమెకి పెళ్లయి భర్త గొడవలు రావడంతో విడిపోయింది. కూతురు కీర్తనతో కలిసి కూలి పని చేసుకుంటూ ఒంటరిగా ఉంటుంది. రెండేళ్ల క్రితం ఆమెకి ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ఉలవ సురేష్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ఇద్దరి మధ్య ప్రేమకి దారితీసింది. అప్పటినుంచి ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. వీరి అనుబంధానికి గుర్తుగా జెర్సీ (1) చిన్నారి పుట్టింది.

భర్త అంత్యక్రియలకు వచ్చి.. అత్తింటివారి చేతిలో భార్య మరో ఇద్దరు అనుమానాస్పద మృతి...

 కాగా, ఇటీవల సుహాసిని,సురేష్ ల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో సురేష్ సుహాసిని అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. దీనికోసం పక్కా పథకం తయారు చేశాడు. శనివారం సాయంత్రం సుహాసిని, కీర్తన, ఏడాది వయసున్న చిన్నారి జెర్సీని తీసుకుని రాజమహేంద్రవరంలో బట్టలు కొందామంటూ కారులో బయలుదేరాడు.

 ఆ తర్వాత రాత్రంతా ఎక్కడెక్కడో కారులో తిప్పాడు. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో రావులపాలెం లోని గౌతమి పాత వంతెన దగ్గరికి తీసుకొచ్చాడు. అక్కడ సెల్ఫీ తీసుకుందామని అన్నాడు. అని చెప్పి సుహాసినిని, ఇద్దరు కూతుర్లను రెయిలింగ్ దగ్గర పిట్టగోడ మీద నిలబెట్టారు. వారు కూడా సెల్ఫీ తీసుకుంటామని సంతోషపడ్డారు. వారిని నమ్మించిన తర్వాత ఒక్కసారిగా వారందరిని నదిలోకి తోసేసాడు. ఆ తర్వాత సెకండ్లలో అక్కడి నుంచి కారు ఎక్కి పరారయ్యాడు.

 అయితే, ఈ క్రమంలో సుహాసిని, జెర్సీ నదిలో పడిపోయారు. కీర్తన మాత్రం పడే సమయంలో వంతెన పక్కన ఉన్న కేబుల్ పైపు చేతికి తగిలింది. దీంతో దాన్ని గట్టిగా పట్టుకుంది. ఒక చేత్తో పైపు పట్టుకుని వేలాడుతూనే గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టింది. కళ్ళు పొడుచుకున్న కానరాని చీకటి పైన.. కింద ఫోరెత్తే గోదావరి. అయినా ఆ చిన్నారి ధైర్యం కోల్పోకుండా రక్షించమంటూ కేకలు వేయడం ప్రారంభించింది.

 కా కాసేపటికి ఆ చిన్నారికి తన జేబులో ఫోన్ ఉన్న సంగతి గుర్తుకు వచ్చింది. దీంతో.. ఒక చేత్తో పైపును పట్టు జారిపోకుండా గట్టిగా పట్టుకుని… మెల్లిగా మరో చేత్తో ఫోన్ బయటికి తీసింది. ఫోను జాగ్రత్తగా బయటకి తీసి నదిలో పడిపోకుండా పట్టుకుని డయల్ 100 కి కాల్ చేసింది. తానున్న పరిస్థితి వివరించింది. పరిస్థితి సీరియస్ ని అర్థం చేసుకున్న రావులపాలెం ఎస్సై వెంకటరమణ సిబ్బందితో సహా హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.

పైపును పట్టుకుని వేలాడుతున్న బాలికను రక్షించారు. అరగంట పాటు ఆ చీకట్లో పైపును పట్టుకొని వేలాడుతూ ఉండడమే కాకుండా.. చాలా తెలివిగా వ్యవహరించి తమకు సమాచారం ఇచ్చిన తీరుకి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఆమె ధైర్యానికి అభినందించారు. ఓవైపు తల్లి చెల్లి చనిపోయిన విషాదం.. మరోవైపు నమ్మిన వ్యక్తే తండ్రిలా వ్యవహరించిన వ్యక్తి తమను చంపాలని చూసిన షాక్ మరోవైపు. ఆ చిన్నారి జీవితాన్ని అతరాకుతలం చేసినా మొక్కవోని ధైర్యంతో బతికి బయటపడింది.

 పోలీసులు నదిలో గల్లంతైన వారి కోసం ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. చిన్నారి చెప్పిన సమాచారం మేరకు నిందితుడు కోసం మరో బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు సీఐ రజిని కుమార్ వివరాలు తెలిపారు. ఎస్పీ శ్రీధర్ చిన్నారిని రక్షించిన పోలీసులను అభినందించారు.