పిడికిలి బిగించి చిరునవ్వుతో అభివాదం చేస్తూ... ఈడీ కార్యాలయానికి బయలుదేరిన కవిత

Mar 20, 2023, 11:33 AM IST

న్యూడిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడి (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) విచారణకు హాజరయ్యారు.డిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ఈ నెల 16న ఈడీ విచారణకు హాజరుకాలేదు. దీంతో ఇవాళ (మార్చి 20 సోమవారం) హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో ఇవాళ కూడా కవిత విచారణకు హాజరవుతారా... లేదా? అన్న ఉత్కంఠ నెలకొంది. దీనికి తెరదించుతూ కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే దేశ రాజధాని డిల్లీకి చేరుకున్న కవిత ఈడీ కార్యాలయానికి బయలుదేరారు. బిఆర్ఎస్ శ్రేణులకు  అబివాదం చేస్తూ చిరునవ్వుతో కారెక్కారు కవిత. భర్త అనిల్ వెంటరాగా ఈడీ కార్యాలయానికి బయలుదేరారు ఎమ్మెల్సీ కవిత. అయితే కవితను ఈడీ అరెస్ట్ చేసే అవకాశాలున్నయన్న నేపథ్యంలో అసలేం జరుగుతుందోనని బిఆర్ఎస్ నాయకులతో పాటు ప్రతిపక్షాల్లో ఉత్కంఠ నెలకొంది.