నిన్న విజయవాడ, నేడు విశాఖపట్నం... అర్ధరాత్రులు బైక్స్ కు నిప్పంటించి దుండగుల వీరంగం

May 14, 2022, 4:20 PM IST

విశాఖపట్నం: విజయవాడలో గంజాయి గ్యాంగ్ వీధుల్లో వీరంగం సృష్టించి ఇంటిముందు నిలిపిన బైక్స్ కు నిప్పంటించిన ఘటన మరువకముందే విశాఖపట్నంలోనూ అలాంటి ఘటనే చోటుచేసుకుంది. విశాఖ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్లిపురం బంగారమ్మ మెట్టకంఠం వారి వీధిలో అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు హల్ చల్ చేసారు. అర్ధరాత్రి రెండుగంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇళ్లముందు నిలిపివుంచిన ద్విచక్రవాహనాలకు నిప్పంటించారు. ఇలా బైక్స్ దగ్దంతో మంటలు ఎగిసిపడి కరెంట్ తీగలు వేడెక్కి తెగిపోయాయి. అయితే రాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో తీగలు రోడ్డుపై పడ్డా నిర్మానుష్యంగా వుండటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎలాంటి ప్రమాదం జరక్కుండా ముందుగా కరెంట్ సరఫరా నిలిపివేయించారు. పోలీసులు చేరుకునేసరికే బైక్స్ పూర్తిగా దగ్దమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.