రేపటి గుడివాడ మహానాడు వాయిదా... టిడిపి చీఫ్ చంద్రబాబు ప్రకటన

Jun 28, 2022, 4:31 PM IST


అమరావతి : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సభాప్రాంగణమంతా చిత్తడిగా మారడంతో తెలుగుదేశం పార్టీ గుడివాడ మహానాడు వాయిదా పడింది. రేపు జరగాల్సిన మహానాడు మరోరోజు నిర్వహించుకుందామని పార్టీ శ్రేణులకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. వర్షాలతో వాతావరణం అనుకూలంగా లేనందున మహానాడు కార్యక్రమం వాయిదా వేద్దామని ముఖ్యనేతలతో సమీక్షలో చంద్రబాబు పేర్కొన్నారు. అయితే గుడివాడలో ఎట్టిపరిస్థితుల్లో మహానాడు నిర్వహిద్దామని... ఆ తర్వాతే మరో కార్యక్రమం చేపడదామన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా గుడివాడ మహానాడు తదుపరి తేదీ ఖరారు చేయాలని నేతలకు చంద్రబాబు ఆదేశించారు. 

గుడివాడలో టిడిపి మహానాడు కోసం జరుగుతున్న ఏర్పాట్లకు వర్షం ఆటంకం సృష్టించింది. సభాప్రాంగణమంతా బుదరమయం అయ్యింది. అక్కడి పరిస్థితులను మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పరిశీలించారు.