కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరింత తగ్గించాలంటూ... విశాఖలో వామపక్షాల వినూత్న నిరసన

May 25, 2022, 2:35 PM IST

విశాఖపట్నం: కేంద్ర బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు, రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు, ఆర్టిసి చార్జీలు, పన్నులతో పాటు ఇతర నిత్యావసర ధరలను పెంచి ప్రజలపై భార మోపుతున్నాయని వామపక్షాలు ఆరోపించాయి. ఇలా పెంచిన ధరలను తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు విశాఖలో ఆందోళన చేపట్టాయి. బుధవారం  సిరిపురం హెచ్‌పిసిఎల్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. పెట్రోల్ పోయించుకోడానికి బంక్‌కు వచ్చిన వారికి కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ ప్రచురించిన కరపత్రాలు పంపిణీచేసారు. పెంచిన ధరలు పూర్తిగా రద్దుచేయాలని... ఇకపై కూడా పెంచకుండా చర్యలు తీసుకోవాలని వామపక్ష నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వామపక్షాల నిరసన కార్యక్రమంలో సిపిఐఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు,  సిపిఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై.కొండయ్య, ఎస్‌యుసిఐసి జిల్లా ఇన్‌ఛార్జ్‌ పి.గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.