చేపలవేటకు వెళ్లి... రెండుగా చీలి సముద్రంలో కలిసి పోయిన బోటు..

Aug 6, 2020, 5:22 PM IST

విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి బయలుదేరిన బోటు ప్రమాదానికి గురైంది. నాలుగు రోజుల క్రితం ఎనిమిది మందితో  చేపలవేటకు బయలుదేరిన బోటు సరుకుతో  తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. తీరం చేరడానికి చాలా సమయం ఉండడంతో బుధవారం రాత్రి  11 గంటల సమయంలో విశాఖ జిల్లా భీమిలి మండలం అన్నవరానికి 50 కిలోమీటర్ల దూరంలో బోటుకు యాంకర్  వేసి అందరూ నిద్రలోకి జారుకున్నారు. అయితే సముద్రంలో ఈదురు గాలుల కారణంగా యాంకర్ తెగిపోయి బోటు అన్నవరం సాగర తీరానికి కొట్టుకొచ్చింది. మేల్కొన్న కళాసీలు అది గమనించి బోటు నుంచి దూకి ఒడ్డుకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న బోటు యజమాని నరసింహమూర్తి సంఘటన స్థలానికి చేరుకొని 3 ట్రాక్టర్లు, ఒక క్రేన్, 30 మంది సహాయంతో  బోటును బయటకు లాగే ప్రయత్నం చేశారు. అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదు సరికదా బోటు రెండు ముక్కలుగా చీలిపోయింది.  బోటులోని  40 లక్షల సరుకు అంతా సముద్రంలో కలిసిపోయింది.