వజ్రాలు పొదగడంతోపాటు బంగారంతో తయారైన బ్యాక్ ప్యానెల్ గల షియోమీ వారి ‘రెడ్ మీ కే 20 ప్రో గోల్డ్’ ఫోన్ భారత కస్టమర్ల కోసమే సిద్ధమవుతున్నది.ఈ ఫోన్లను వినియోగదారులకు విక్రయించాలా? బహుమతిగా ఇవ్వాలా? అన్నది నిర్ణయించలేదుని షియోమీ ఇండియా ఎండీ మనుకుమార్ జైన్ పేర్కొన్నారు.
హైదరాబాద్: ప్రీమియం ఫీచర్లతో తక్కువ ధరలో స్మార్ట్ఫోన్లను విక్రయిస్తున్న చైనా టెక్నాలజీ కంపెనీ షియోమీ మరో సంచలనానికి సిద్ధమైంది. ‘రెడ్మీ కె20 ప్రో’ మోడల్ ఆధారంగా లిమిటెడ్ ఎడిషన్లో అత్యంత ఖరీదైన వేరియంట్ తయారీకి శ్రీకారం చుట్టింది.
ఈ ఫోన్ ఖరీదు అక్షరాలా రూ.4.8 లక్షలు. బంగారంతో తయారైన బ్యాక్ ప్యానెల్తో రూపుదిద్దుకున్న ఈ ఫోన్ కోసం 100 గ్రాముల పసిడి వాడారు. ప్యానెల్ వైపు ‘కె’ అనే అక్షరంపై 20 వజ్రాలను పొదిగారు. ఈ ఫోన్ కేవలం 20 యూనిట్లు మాత్రమే తయారు చేస్తారు. విశేషమేమంటే ఇవి భారత్లో తయారవుతున్నాయి.
అంతేకాదు భారత్ వినియోగదారులకు మాత్రమే రెడ్ మీ కే 20 ప్రో’ ప్రత్యేకం. ఫోన్ నుంచి ప్యానెల్ను విడదీయడానికి వీలుకాకుండా డిజైన్ చేశారు. ఈ వేరియంట్ను విక్రయించాలా? వద్దా? అన్న సంగతి ఇంకా నిర్ణయించలేదని షియోమీ ఇండియా ఎండీ మను కుమార్ జైన్ మీడియాకు తెలిపారు.
‘ఇన్విటేషన్ ద్వారా విక్రయించాలా, బహుమతిగా ఇవ్వడమా, వేలం వేయడమా అన్నది ఇంకా తేల్చలేదు. వీటి విక్రయంతో వచ్చిన డబ్బులను సామాజిక కార్యక్రమాలకు వెచ్చిస్తాం. కె20 గుర్తుగా బ్యాక్ ప్యానెల్పై ‘కె’ అని ముద్రించాం. ఇప్పటికే ఆసక్తి కనబరిచిన కస్టమర్లు ‘కె’ బదులు, తమ పేరులోని మొదటి అక్షరాన్ని ముద్రించాలని కోరారు’ అని షియోమీ ఇండియా ఎండీ మను కుమార్ జైన్ వివరించారు.
చైనాలో షియోమీ విస్తృత శ్రేణిలో పలు ఉత్పత్తులను రూపొందించి విక్రయిస్తోందని, వీటిని భారత్లో ప్రవేశపెట్టాలంటే ప్రతి ఉత్పాదనలో మార్పులు చేయాల్సి ఉంటుందని ఆ సంస్థ భారత్ ఎండీ మను కుమార్ జైన్ తెలిపారు. దశలవారీగా వీటిని ఇక్కడ పరిచయం చేస్తామన్నారు.
షియోమీ కోసం షూస్, టీ–షర్ట్స్, ఫిట్నెస్ బ్యాండ్స్ తయారీకై దేశంలోని పలు మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలతో చర్చిస్తున్నట్టు మను కుమార్ జైన్ చెప్పారు. స్మార్ట్ఫోన్ల కోసం సంస్థకు దేశంలో నాలుగు ప్రాంతాల్లో ఏడు తయారీ కేంద్రాలు ఉన్నాయి. సెకన్కు మూడు ఫోన్లు ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉంది.