ఎస్ ఇది నిజం: ఫేస్ బుక్ మనల్ని చదివేస్తుంది

By telugu teamFirst Published Sep 28, 2019, 2:07 PM IST
Highlights


సోషల్ మీడియా వేదిక ‘ఫేస్‌‌బుక్‌’ వద్ద మనుష్యుల ఆలోచనల్ని కనిపెట్టే టెక్నాలజీ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. 

గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థలు మనుషులతోనే కాదు, వారి మనసులతోటీ ఆడుకుంటూ ఉంటాయి. మీ వీడియోకి ఇన్ని హిట్స్‌ వస్తే ఇన్ని డబ్బులిస్తామని యూట్యూబ్‌ అంటే... మీ పేజీకి ఇన్ని లైకులు కావాలంటే ఇంత కట్టండి అంటూ ఫేస్‌బుక్‌ యాడ్స్‌ మనతో వ్యాపారం చేస్తాయి. ఇచ్చినా తీసుకున్నా వీటి వ్యాపారం అంతా మనుషుల మనసులతోనూ వారి ఇష్టాలతోనే సుమా!
 
యూట్యూబ్‌ కూడా ఒకప్పుడు గూగుల్‌ సొంతం కాదు. ప్రజల వీడియో అప్‌లోడ్స్‌‌కి జెండా ఊపిన 2005 నాటి ఒక చిన్న సంస్థని గూగుల్‌ సొంతం చేసుకుని.. ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్లు దాన్ని ఇంతదాన్ని చేసింది. 

ఇప్పుడు తాజాగా ఫేస్‌బుక్‌ కూడా ఓ స్టార్టప్‌ కంపెనీని కొనుగోలు చేసింది. ‘కంట్రోల్‌- ల్యాబ్స్‌’ అనే ఈ సంస్థ చేసే ప్రాజెక్ట్‌ ఏంటో తెలుసా? మనుషుల ఆలోచనల ఆధారంగా డివైజెస్‌ని పనిచేయించడం ఆ ప్రాజెక్ట్‌ లక్ష్యం. అసలు ఫేస్‌బుక్‌ ఎప్పటినుంచో మైండ్‌ రీడింగ్‌ ప్రాజెక్టులకి ఆర్థిక సాయం అందిస్తోందని వార్తలు వస్తున్నాయి.
 
మనుషులు ఆలోచనలు చదవాలనుకునే టెక్నాలజీ భవిష్యత్తులో అత్యంత ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉందని ఇప్పటికే మేధావులు, సామాజిక శాస్త్రవేత్తలు గోలపెడుతున్నారు, ఇలాంటి సంస్థల ప్రయోగాల్ని ఖండిస్తున్నారు. కానీ కోట్లిచ్చి ఫేస్‌బుక్‌లాంటి ప్రముఖ కంపెనీలే ఇలాంటి సంస్థల్ని కొనేస్తుంటే - వీరి మాటను పాలకులు వింటారా? అన్నది సందేహమే. 

click me!