తమ సంస్థపై అమెరికా విధించిన నిషేధంపై చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం హువావే ఫౌండర్ రెన్ జెంగ్ ఫీ ఘాటుగానే స్పందించారు. తమ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయొద్దని హెచ్చరించారు. 5జీ నెట్ వర్క్ లో తమదే పై చేయి అని, తామేమీ ఏకాకులం కాదన్నారు. మరోవైపు అమెరికా తన నిషేధాన్ని 90 రోజులు సడలించింది. గూగుల్ సైతం తమ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ వాడుకోవచ్చునని పేర్కొంది.
బీజింగ్: తమపై ఆంక్షలు విధించిన అమెరికాపై చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘హువావే’ మండిపడింది. అమెరికా తీరుపై స్వరం పెంచింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో హార్డ్వేర్, ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్, టెక్నాలజీ సేవలను హువావేకు బదిలీ చేయడం నిలిపేస్తున్నామని టెక్నాలజీ దిగ్గజం ‘గూగుల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
దీనిపై హువావే వ్యవస్థాపకుడు రెన్ జెంగ్ఫీ గట్టిగానే స్పందించారు. తమని తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించారు. ‘మా బలాన్ని తక్కువగా అంచనా వేసి అమెరికా రాజకీయ నేతలు ఈ చర్యలకు పాల్పడుతున్నారు’ అని చైనీస్ స్టేట్ మీడియా సీసీటీవీతో రెన్ జెంగ్ఫీ అన్నారు.
మరోపక్క హువావే వ్యాపారంపై ఆంక్షలు విధిస్తూ విధించిన నిషేధాన్ని 90 రోజులు సడలిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు అమెరికా వాణిజ్య శాఖ ఒక ప్రకటన చేసింది. ఈ నిర్ణయంతో హువావేకు కాస్త ఊరట లభించింది.
హువావేతో జాతీయ భద్రతకు ముప్పు ఉందని, ట్రంప్ విధించిన నిషేధంలో ఎలాంటి మార్పు ఉండదని వాణిజ్య శాఖ తెలిసింది. అమెరికా సంస్థలతో వాణిజ్యానికి హువావేకు తాత్కాలిక లైసెన్స్ మాత్రమే ఇస్తున్నట్లు ప్రకటించింది.
అమెరికాలోని టెలికాం ఆపరేటర్లు కీలక సేవల కోసం హువావే ఫోన్ పరికరాలు వినియోగిస్తుండటంతో ఆయా కంపెనీలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేందుకే నిషేధాన్ని 90రోజులు సడలించినట్లు ప్రభుత్వం వివరించింది.
తాత్కాలిక లైసెన్స్ ఇవ్వడం వల్ల హువావే మొబైల్ఫోన్ల వినియోగదారులకు సేవలు కొనసాగడమే కాకుండా గ్రామీణ బ్రాండ్ నెట్వర్క్ తమ సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని అమెరికా తెలిపింది.
అమెరికా ఆంక్షలపై హువావే ఫౌండర్ రెన్ జెంగ్ ఫీ ఘాటుగానే స్పందించారు. ‘ప్రస్తుతం అమెరికా చర్యల వల్ల హువావే 5జీ నెట్వర్క్పై ఎలాంటి ప్రభావం చూపదు. హువావే స్థాయి టెక్నాలజీని అందుకోవాలంటే ఇతర సంస్థలకు రెండు, మూడేళ్లు పడుతుంది. హువావేపై అమెరికా విధించిన నిషేధాన్ని 90 రోజులు సడలించినా ఆ ప్రభావం ఉంటుందని మేము అనుకోవడం లేదు’ అని రెన్ జెంగ్ ఫీ పేర్కొన్నారు.
‘అన్ని రకాల పరిస్థితులకు మేం సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి చర్యలతో మేం ఏకాకులం కాబోం. అమెరికాలోని టెక్ సంస్థలు తయారు చేస్తున్న చిప్సెట్లను మేమూ తయారు చేయగలం. అలా అని దాని అర్థం ఆ వస్తువులను మేము కొనుగోలు చేయమని కాదు. ఇతరులతో పోలిస్తే, 5జీ నెట్వర్క్అభివృద్ధిలో హువావే అందరికన్నా ముందు ఉంది’ అని రెన్ పేర్కొన్నారు.
హార్డ్వేర్, సాఫ్ట్వేర్లతో సహా ఇతర ఏ సాంకేతిక సహకారం హువావేకు అందించబోమని గూగుల్ మొన్న ప్రకటించిన విషయం తెలిసిందే. దీనివల్ల ఇప్పటికే హువావే మొబైల్స్ వినియోగిస్తున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్లకు సంబంధించి కొత్త అప్డేట్స్ను కూడా గూగుల్.. హువావే వినియోగదారులు యథావిధిగా అందిస్తుందని పేర్కొంటూ ఇప్పటికే గూగుల్ స్పష్టతనిచ్చింది.
అయితే హువావేపై అమెరికా విధించిన నిషేధం సడలించినా, భవిష్యత్లో ఆ కంపెనీ తయారు చేసే స్మార్ట్ఫోన్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపనుంది. స్మార్ట్ఫోన్లలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ను హువావే వినియోగించుకోలేదు. దీనివల్ల చైనా వెలుపల విక్రయాలు జరపాలంటే ఇబ్బందులు తప్పవు.
ఎందుకంటే గూగుల్ అందించే సేవలైన గూగుల్ ప్లే, స్టోర్, జీమెయిల్, యూట్యూబ్ వంటి అప్లికేషన్లు హువావే ఫోన్లలో అందుబాటులో ఉండవు. ‘హువావే కేవలం ఆండ్రాయిడ్కు సంబంధించిన పబ్లిక్ వెర్షన్ను మాత్రమే వినియోగించుకోగలదు. అత్యంత ప్రాముఖ్యత కలిగిన యాప్స్ను, సేవలను గూగుల్ నుంచి పొందలేదు’ అని టెక్ నిపుణులు అంటున్నారు.
మరి ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాల నేపథ్యంలో ఈ వాణిజ్య యుద్ధం ఎటువైపు మళ్లుతుందో చూడాలి. ఇరాన్ తో కలిసి గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న అమెరికా ఆరోపణలతో హువావే ఫౌండర్ రెన్ జెంగ్ ఫీ తనయ, సంస్థ సీఎఫ్ఓ మెంగ్ వాంగ్ జూను కెనడా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.