‘లాక్‌డౌన్’ ఎఫెక్ట్: ఐటీ కంపెనీల ‘డివిడెండ్ల’కు రాంరాం.. వచ్చే ఏడాది కూడా

By narsimha lodeFirst Published Jun 17, 2020, 11:40 AM IST
Highlights

కార్పోరేట్‌ వ్యవస్థలో మిగతా రంగాలతో పోలిస్తే ఐటీ రంగంలో డివిడెండ్‌ చెల్లింపులు కాస్త ఎక్కువగానే ఉంటాయి. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఐటీ కంపెనీల డివిడెండ్‌ చెల్లింపుల్లో భారీ కోత ఉండవచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

న్యూఢిల్లీ: కార్పోరేట్‌ వ్యవస్థలో మిగతా రంగాలతో పోలిస్తే ఐటీ రంగంలో డివిడెండ్‌ చెల్లింపులు కాస్త ఎక్కువగానే ఉంటాయి. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఐటీ కంపెనీల డివిడెండ్‌ చెల్లింపుల్లో భారీ కోత ఉండవచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. కోవిడ్‌-19 వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో అదనపు వ్యయాలు పెరగడం, నికర లాభం తగ్గడంతో నగదు ప్రవాహం క్షీణించడం, భవిష్యత్ అవసరాలకు కంపెనీలు నగదు నిల్వలను అట్టిపెట్టికోవడం లాంటి చర్యలతో మునుపటి మాదిరిగా డివిడెండ్‌ చెల్లింపులు ఉండకపోవచ్చని వారు చెబుతున్నారు.  

‘ఈ ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్‌ చెల్లింపు పాలసీని మార్పు చేయవలసి ఉంటుంది. ప్రతికూల వృద్ధిని అధిగమించే ప్రక్రియలో భాగంగా కంపెనీలు నగదు నిల్వలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది’ అని ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌ఓ, బోర్డు సభ్యుడు బాలకృష్ణన్‌ తెలిపారు.

అధిక నగదును కలిగిన పరిశ్రమలో ఐటీ అగ్రస్థానంలో ఉంటుంది. ఐటీ సంస్థలు మిగులు నగదును తమ షేర్‌ హోల్డర్లకు మధ్యంతర, వార్షిక డివిడెండ్ల రూపంలో చెల్లిస్తుంటాయి. రెగ్యులర్‌గా డివిడెండ్‌ చెల్లించడంతోపాటు షేర్ ధర ఆకర్షణీయ విలువల వద్ద ట్రేడ్‌ అవుతుండటంతో స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్లు ధీర్ఘకాలిక దృష్ట్యా ఈ రంగ షేర్ల కొనుగోళ్లకు ఎక్కువగా మొగ్గుచూపుతుంటారు.

గత ఆర్థిక సంవత్సరం (2019-20)లో డిమాండ్ మందగించింది. దీంతో ఒక్క టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మినహా ఐటీ కంపెనీలు డివిడెండ్ చెల్లింపులో కోత పెట్టాయి.

టీసీఎస్‌ ఆర్థిక సంవత్సరం 2019-20లో తన షేర్‌హోల్డర్లకు రూ.31,895 కోట్ల నిధులను డివిడెండ్‌ రూపంలో చెల్లించింది. ఈ మొత్తం విలువ కంపెనీ ఫ్రీ క్యాష్‌ ఫ్లోలో 108.9శాతంగా ఉంది. అలాగే 2018-19, 2017-18లో టీసీఎస్ డివిడెండ్‌ చెల్లింపు నిష్పత్తి వరుసగా 110.2శాతం, 106శాతంగా ఉంది.

also read:అమెరికాలో మనోళ్లు: 1.25 లక్షల ఉద్యోగాలు కల్పించారు..

టీసీఎస్ మినహా, ఆర్థిక సంవత్సరం 2019, 2020లో అ‍గ్రశ్రేణి ఐటీ కంపెనీలు బైబ్యాక్‌లతో సహా తమ చెల్లింపుల నిష్పత్తిని తగ్గించాయని షేర్ ఖాన్ బ్రోకరేజ్ సంస్థ రీసెర్చ్ హెడ్ సంజీవ్ హోతా తెలిపారు. 

కోవిడ్‌-19 వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా చెల్లింపు నిష్పత్తి భారీగా తగ్గేందుకు అవకాశం ఉందన్నారు. ఐటీ కంపెనీలు వ్యయాలను భరించేందుకు నగదు పరిరక్షణ చర్యలకు పూనుకోవచ్చునని సంజీవ్‌ హోతా తెలిపారు. 

సాధ్యమైనంత వరకు ఐటీ కంపెనీలు మూలధన కేటాయింపు పాలసీను మార్చుకోవని ప్రముఖ ఐటీ ఔట్‌సోర్సింగ్‌ అడ్వైజర్‌ పరీఖ్‌  వ్యాఖ్యానించారు. అయితే వారి సంప్రదాయ విధానాలకు కోవిడ్‌-19 గండికొట్టిందన్నారు. 

ఇదే సందర్భంలో వ్యవస్థలో నెలకొన్న సంక్షోభంతో విలీన అవకాశాలను కల్పిస్తున్నాయని ప్రముఖ ఐటీ ఔట్‌సోర్సింగ్‌ అడ్వైజర్‌ పరీఖ్‌ తెలిపారు. కాబట్టి సాధ్యనమైంత వరకు ఐటీ కంపెనీలు నగదు నిల్వలకే మొగ్గు చూపాయని చెప్పారు.

click me!