మిస్టర్ కూల్ కాస్తా "300 మ్యాచ్లు ఆడా, పిచ్చోడినా" అంటూ కుల్దీప్ యాదవ్ కు వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత మిస్టర్ కూల్ చెప్పినట్లే జరిగింది.
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఓసారి కోపం వచ్చిందట. ఆ కోపంలో మిస్టర్ కూల్ కాస్తా "300 మ్యాచ్లు ఆడా, పిచ్చోడినా" అంటూ కుల్దీప్ యాదవ్ కు వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత మిస్టర్ కూల్ చెప్పినట్లే జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా బౌలర్ కుల్దీప్యాదవ్ వెల్లడించాడు
ఎంఎస్ ధోనీతో తమకు ఉన్న అనుభవాన్ని ఓ ప్రైవేటు కార్యక్రమంలో టీమిండియా స్పిన్నర్లు కుల్దీప్యాదవ్, చాహల్ పంచుకున్నారు. తాము బౌలింగ్ చేస్తున్నప్పుడు సగం పని ధోనీనే చేసేవాడని చెప్పారు. వికెట్ కీపర్గా ఉంటూ ధోనీ బ్యాట్స్ మన్ ప్రతి కదలికను పసిగడుతూ ఎప్పటికప్పుడు బౌలర్లకు సూచనలు చేస్తుంటాడని తెలిపారు.
ఈ సందర్భంగా ఇండోర్లో జరిగిన ఓ విషయాన్ని కుల్దీప్యాదవ్ గుర్తుచేశారు. శ్రీలంకతో జరిగిన టీ-20 మ్యాచ్లో టీమిండియా భారీ స్కోర్ చేసిందని, టార్గెట్ ఛేదించడానికి శ్రీలంక కూడా జోరుగా ఆడుతోందని, ఆ సమయంలో తాను బౌలింగ్ చేస్తున్నానని చెప్పాడు. తాను వేసిన ప్రతీబంతిని బ్యాట్స్మెన్ బౌండరీకి పంపుతున్నారని, అప్పుడు ధోనీ తనను పిలిచి ఫీల్డ్ మార్చుకొని బౌలింగ్ చేయాలని చెప్పాడని అన్నాడు.
తాను ఊరుకోకుండా "నాకు తెలుసు.. నువ్వు కూల్గా ఉండు ధోనీ అన్నాను. దీంతో ఆయన నాపై ఆగ్రహించారు. 300 మ్యాచ్లు ఆడాను. నేనేమన్నా పిచ్చోడినా. నేను చెప్పినట్టు చేయి అంటూ కోపగించుకున్నారు" అని చెప్పాడు.
ఆ తర్వాత ధోనీ చెప్పినట్టే బౌలింగ్ వేశానని, ఆ ఓవర్లో వికెట్ పడిందని, దీంతో ధోనీ తన దగ్గరకి వచ్చి నేను చెప్పింది ఇదే కదా అన్నారని అని కుల్దీప్యాదవ్ చెప్పాడు.