క్రీడా ప్రపంచంలో విషాదం... కరోనాతో పోరాడుతూ ‘షూటర్ దాది’ చంద్రో తోమర్ మృతి...

By Chinthakindhi RamuFirst Published Apr 30, 2021, 4:50 PM IST
Highlights

కొన్నిరోజుల కిందట కరోనా బారిన పడిన చంద్రో తోమర్... చికిత్స పొందుతూ ఆకస్మిక మరణం...

చంద్రో తోమర్ జీవిత కథ ఆధారంగా తాప్సీ పన్ను, భుమీ పడ్నేకర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘సాండ్ కి అంక్’  బయోపిక్...

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా భూతం, మరో క్రీడా కిరణాన్ని మింగేసింది. తన షూటింగ్ టాలెంట్‌తో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలను సొంతం చేసుకున్న ‘షూటర్ దాది’ చంద్రో తోమర్, కరోనాతో పోరాడుతూ ప్రాణాలు విడిచింది.

1932లో ఉత్తరప్రదేశ్‌లో జన్మించిన చంద్రో తోమర్, షార్ప్ షూటర్‌గా 30కి పైగా నేషనల్ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొని అనేక అవార్డులు గెలుచుకుంది. ప్రపంచంలో అత్యధిక వయసు గల షూటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న చంద్రో తోమర్, 89 ఏళ్ల వయసులోనూ షూటింగ్‌ను కొనసాగించింది.

తన జీవితంలో ఎన్నడూ బడి మెట్లు ఎక్కని చంద్రో తోమర్, 15 ఏళ్ల వయసులోనే పెళ్లిచేసుకుంది. 65 ఏళ్ల వయసులో షార్ప్ షూటర్‌గా కెరీర్‌ మొదలెట్టిన చంద్రో తోమర్, కొన్ని రోజుల కిందట కరోనా బారిన పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం, ఏప్రిల్ 30న తుది శ్వాస విడిచింది.

చంద్రో తోమర్ జీవిత కథ ఆధారంగా తాప్సీ పన్ను, భుమీ పడ్నేకర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘సాండ్ కి అంక్’  బయోపిక్ సినిమా రూపొందింది. చంద్రో తోమర్ మరణవార్త తెలుసుకున్న తాప్సీ పన్ను, భూమీ పడ్నేకర్ నివాళులు ఘటిస్తూ ట్వీట్ చేశారు.

click me!