ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కన్నౌజు జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. పత్రాలు జీరాక్స్ తీసుకోవడానికి వెళ్లిన ఇద్దరు బాలికలపై సైబర్ కేప్ లో నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు.
కన్నౌజ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కన్నౌజులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. డాక్యుమెంట్స్ ను జీరాక్స్ తీయించుకోవడానికి వెళ్లిన ఇద్దరు బాలికలను నలుగురు వ్యక్తులు బంధించారు. ఆ తర్వాత వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన సెప్టెంబర్ 13వ తేదీన కన్నౌజు జిల్లాలో చోటు చేసుకుంది.
ఓ మహిళతో పాటు మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ ప్రశాంత్ వర్మ చెప్పారు. అత్యాచార ఘటనను నిందితులు వీడియో తీశారని, ఆ విషయాన్ని బయటికి చెప్తే వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదరించారని 17 ఏళ్ల బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రూ. 10 వేలు ఇవ్వాలని కూడా బెదిరించారని, దాంతో తనూ తన స్నేహితురాలు కలిసి తమ ఇళ్లలో చోరీలు చేసి డబ్బులు ఇచ్చామని ఆమె చెప్పింది. డబ్బు పోయిన విషయంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారని పోలీసులు చెప్పారు. సైబర్ కేఫ్ లో వ్యభిచారం కూడా జరుగుతున్నట్లు తేలిందని చెప్పారు.
సైబర్ కేఫ్ వద్ద పలుమార్లు యువతులను చూశామని చుట్టుపక్కలవాళ్లు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. బాలికలను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. కాగా, సంఘటన జరిగిన తర్వాత నిందితుల్లో ఒకడి భార్య తనకు ఫోన్ చేసి వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేసిందని బాధితురాలు చెప్పింది.