
ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబానికి ఆధార్ మాదిరిగా ప్రత్యేకమైన ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆ కార్డులో కుటుంబ సభ్యుల అవసరాలు, అలాగే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. ఉమ్మడి కుటుంబాలు ఉన్నా కూడా పథకాల లబ్ధి ఆగిపోతుందనే భయం అవసరం లేదని, అవసరమైతే పథకాలను కొత్త రూపంలో తీసుకువస్తామని తెలిపారు. జనాభా విధానం సిద్ధం చేసే పనిలో కూడా ముందడుగు వేయాలని ఆయన సూచించారు. గురువారం సచివాలయంలో కుటుంబ ప్రయోజనాల పర్యవేక్షణ వ్యవస్థపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఇందుకు సంబంధించి ఈ రోజు పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.
గడిచిన మూడు రోజులుగా తెలంగాణలో వర్షాలు దంచికొడుతోన్న విషయం తెలిసిందే. అయితే శుక్రవారం కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ రెండు జిల్లాల్లో గంటకు 62 నుంచి 87 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది. దీంతో ఈ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
భారతదేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గిపోతే కొన్ని సమాజాలు కనుమరుగయ్యే పరిస్థితి తలెత్తవచ్చని ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ హెచ్చరించారు. ప్రతి కుటుంబం కనీసం ముగ్గురు పిల్లలు కలిగి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఇలా చేస్తే జనాభా స్థిరత్వం కాపాడటమే కాకుండా, క్షీణతను అడ్డుకోవచ్చని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆరెస్సెస్ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న భాగవత్, మతమార్పిడి, చొరబాట్లు, హిందూ-ముస్లిం సౌహార్దం, భాషా వివాదాలు వంటి అంశాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా బీజేపీతో తమకు విభేదాలు లేవని కూడా స్పష్టంచేశారు. మరి దీనిపై కాంగ్రెస్ ఈరోజు ఎలా స్పందిస్తుందో చూడాలి.
అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్లు, మీడియా ప్రతినిధులపై కొత్త వీసా పరిమితులు ప్రతిపాదించారు. ఇప్పటివరకు ఎఫ్-1, జే-1 వీసాదారులు చదువు లేదా ఇంటర్న్షిప్ పూర్తయ్యే వరకు ఉండే వెసులుబాటు ఉండగా, ఇకపై గరిష్ఠంగా నాలుగేళ్లపాటు మాత్రమే అనుమతించనున్నారు. గ్రాడ్యుయేట్ స్థాయిలో కోర్సులు మార్చుకునే విద్యార్థులకు ఆంక్షలు ఉంటాయి. చదువు పూర్తయ్యాక కొత్త వీసా కోసం ప్రయత్నించే ఎఫ్-1 విద్యార్థుల గ్రేస్ పీరియడ్ను 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించారు. ఐ-వీసా పొందిన మీడియా ప్రతినిధులు 240 రోజుల పాటు ఉండవచ్చు, అవసరమైతే మరో 240 రోజులు పొడిగించుకునే అవకాశం ఉంది. చైనా మీడియా ప్రతినిధులపై ప్రత్యేక ఆంక్షలు విధించనున్నారు. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకారం, ఈ మార్పులు భద్రతా సమస్యలు తగ్గించడంతో పాటు ప్రభుత్వంపై భారం తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నారు.
కబడ్డీ ప్రేక్షకులకు మళ్లీ పండగ వాతావరణం రానుంది. ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్ ఈ శుక్రవారం నుంచి ప్రారంభమవుతోంది. తొలి పోరులో తెలుగు టైటాన్స్ జట్టు, తమిళ్ తలైవాస్తో తలపడనుంది. ఆ తర్వాతి మ్యాచ్లో బెంగళూరు బుల్స్, పుణెరి పల్టాన్ మధ్య పోటీ జరుగుతుంది. ముఖ్యంగా, ఈ సీజన్ ప్రత్యేకత ఏమిటంటే… దాదాపు ఏడు సంవత్సరాల విరామం తర్వాత విశాఖపట్నం మరోసారి ఈ లీగ్కు వేదికగా నిలుస్తోంది.