మళ్లీ ఒక సారి ఆలోచించండి..పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంలో పాల్గొనండి: ప్రతిపక్షాలకు నిర్మలా సీతారామన్ విజ్ఞప్తి

By Asianet NewsFirst Published May 25, 2023, 2:31 PM IST
Highlights

పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవానికి రావాలని, మనసు మార్చుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపక్ష పార్టీలను కోరారు. ఈ విషయంలో మళ్లీ ఒక సారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ప్రజాస్వామ్య దేవాలయం అని అన్నారు. 

ఈ నెల 28న జరిగే పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించవద్దని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో మళ్లీ ఒక సారి ఆలోచించాలని చెప్పారు. ఈ మేరకు తమిళనాడులో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆదివారం జరిగే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సహా విపక్షాలు హాజరుకావాలని ఆమె కోరారు.

వివాదాస్పద స్వయం ప్రకటిత దైవం ధీరేంద్ర కృష్ణ శాస్త్రికి వై-కేటగిరీ భద్రత.. ఎందుకంటే ?

పార్లమెంటును ప్రజాస్వామ్య దేవాలయంగా అభివర్ణించిన సీతారామన్.. ప్రధాని నరేంద్ర మోదీ కూడా అందులోకి అడుగపెట్టే ముందు నమస్కరించారని గుర్తు చేశారు. ‘‘ఇది ప్రజాస్వామ్య దేవాలయం. ప్రధానమంత్రి కూడా కొత్త భవనం మెట్లకు వంగి నమస్కరించి పార్లమెంటులోకి ప్రవేశించారు. నేను వినమ్రంగా అభ్యర్థిస్తున్నాను. విజ్ఞప్తి చేస్తున్నాను (ప్రతిపక్షం), దయచేసి పునరాలోచించండి. మీ మనస్సు మార్చుకోండి.. వేడుకల్లో పాల్గొనండి’’ అని కోరారు.

అలాగే పార్లమెంటు కొత్త భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలన్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే బుధవారం ఒక ప్రకటనలో ప్రతిపక్షాలను కోరింది. పార్లమెంటును ప్రతిపక్షాలు అగౌరవపరచడం మేధోపరమైన దివాళాకోరుతనానికి నిదర్శనమని, ఇది ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించడమేనని పేర్కొంది. పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలన్న ప్రతిపక్షాల నిర్ణయం భారత ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను ఉల్లంఘించడమేనని పేర్కొంది.

గంగిరెడ్డి బెయిల్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అసాధారణం - సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ప్రతిపక్షాల నిర్ణయంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించడం దురదృష్టకరమన్నారు. ‘‘ఇది ఒక చారిత్రాత్మక ఘటన అని నేను వారికి చెప్పాలనుకుంటున్నాను. ఇది రాజకీయాలకు సమయం కాదు... బహిష్కరించడం, కొత్త సమస్య నుంచి సమస్యలు సృష్టించడం అత్యంత దురదృష్టకరం. తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించి ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొనాలి’’ అని కోరారు. 

కాగా.. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆప్, ఎన్సీపీ, ఎంఐఎం, ఆర్జేడీ, సీపీఎం సహా పలు రాజకీయ పార్టీలు కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్య ఆత్మను పార్లమెంటు నుంచి లాక్కున్నప్పుడు, కొత్త భవనంలో తమకు విలువ లేదని, కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలన్న తమ సమిష్టి నిర్ణయాన్ని ప్రకటిస్తున్నామని విపక్షాలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి.

అమెరికాలో మహబూబ్‌నగర్‌ యువకుడు మృతి.. ఏమైందంటే ?

ఇదిలా ఉండగా.. పార్లమెంట్ కొత్త భవన వేడుక కార్యక్రమానికి హాజరువుతామని ఇప్పటి వరకు శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం), నేషనల్ పీపుల్స్ పార్టీ, నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, సిక్కిం క్రాంతికారి మోర్చా, రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ, అప్నా దల్ (సోనీలాల్), రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, తమిళ మనీలా కాంగ్రెస్, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, మిజో నేషనల్ ఫ్రంట్, వైసీపీ, తెలుగుదేశం పార్టీ, శిరోమణి అకాలీదళ్, బిజు జనతా దళ్ లు ప్రకటించాయి. ప్రభుత్వ ఆహ్వానాన్ని అంగీకరించాయి. 
 

click me!