విద్యార్థి హాల్ టికెట్ పై బిగ్ బీ ఫోటో

By rajesh yFirst Published Sep 4, 2018, 4:12 PM IST
Highlights

ఓటరు జాబితాలో ఫోటోలు మారిపోవడం చూశాం. ప్రాంతాలు మారిపోవడం చూశాం....విదేశీయులకు కూడా ఓటు హక్కు కల్పిస్తూ ఐడీ కార్డు వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఆఖరికి ఇటీవలే షిర్డి సాయిబాబాకు కూడా ఓటు హక్కు కల్పించారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఓ విద్యార్థి హాల్ టిక్కెట్ పై అమితాబ్ ఫోటోతో రావడం కలకలం రేపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ లో జరిగింది.

ఉత్తరప్రదేశ్: ఓటరు జాబితాలో ఫోటోలు మారిపోవడం చూశాం. ప్రాంతాలు మారిపోవడం చూశాం....విదేశీయులకు కూడా ఓటు హక్కు కల్పిస్తూ ఐడీ కార్డు వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఆఖరికి ఇటీవలే షిర్డి సాయిబాబాకు కూడా ఓటు హక్కు కల్పించారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఓ విద్యార్థి హాల్ టిక్కెట్ పై అమితాబ్ ఫోటోతో రావడం కలకలం రేపింది. 

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ లో జరిగింది. ఫైజాబాద్‌లోని డాక్టర్‌ రామ్‌ మనోహర్‌ లోహియా విశ్వవిద్యాలయంలో అమిత్ ద్వివేది బిఈడీ చదువుతున్నాడు. బిఈడీ విద్యార్థులకు యూనివర్శిటీ  పరీక్షలు నిర్వహిస్తోంది. దీంతో విశ్వవిద్యాలయ అనుబంధ రవీంద్రసింగ్ స్మారక్ మహావిద్యాలయం సిబ్బంది హాల్ టిక్కెట్లను జారీ చేసింది. 


అయితే బిఈడీ విద్యార్థి అమిత్ ద్వివేది హాల్ టికెట్ తీసుకోగా తన ఫోటోకు బదులు బిగ్ బీ ఫోటో రావడం చూసి షాక్ అయ్యాడు. తాను తన ఫోటో అతికించే పరీక్ష దరఖాస్తు నింపానని అయితే ఫోటో ఎలా మారిందని తలపట్టుకున్నాడు. హాల్ టిక్కెట్ పై అమితాబ్ ఫోటో ఉండటంతో పరీక్ష రాసేందుకు నానా పాట్లు పడ్డాడు. సిబ్బంది పరీక్ష రాసేందుకు అనుమతించకపోవడంతో అదనపు ధృవపత్రాలు యాజమాన్యానికి సమర్పిస్తే కానీ పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. 

హాల్ టిక్కెట్ పై వచ్చిన ఫోటో మార్క్స్ లిస్ట్ పై వస్తే పరిస్థితి ఏంటని విద్యార్థి అమిత్ ద్వివేది ఆందోళన చెందుతున్నాడు. కళాశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి పరిస్థితి నెలకొందని విద్యార్థి ఆరోపిస్తున్నాడు.  

అయితే సిబ్బంది మాత్రం ఈ పొరపాటును విద్యార్థి మీదకే నెట్టేస్తున్నారు. అప్లికేషన్‌ నింపేటప్పుడు సక్రమంగా నింపి ఉండకపోవడంతోనే ఇలా జరిగిందని చెప్తున్నారు. కళాశాల సీనియర్‌ అధికారి గుర్పేంద్ర మిశ్రా దృష్టికి విషయం తెలియడంతో మార్కుల లిస్టులో ఇలాంటి పొరపాటు జరగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. అమిత్ ద్వివేది రెగ్యులర్‌గా కళాశాలకు వస్తుంటాడని... రెగ్యులర్‌ కేటగిరీ కిందే అతడు అప్లికేషన్ నింపాడని స్పష్టం చేశారు. 

ఈ పొరపాటు దరఖాస్తు చేసుకునేటప్పుడు అతని వద్ద లేదా ఇంటర్నెట్‌ కేఫ్‌లోనో జరిగి ఉంటుందన్నారు. విశ్వవిద్యాలయంలో కూడా ఇలాంటి తప్పిదం జరిగే అవకాశం లేకపోలేదని తెలిపారు. అమిత్ ద్వివేది పరీక్ష రాయాల్సిందిగా సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌కు లేఖ రాశామని స్పష్టం చేశారు. 

click me!