ఇండియన్ స్పేస్ అసోసియేషన్ ప్రారంభించిన ప్రధాని.. ‘ఖగోళ యుగంలో భారత్ వెనుకబడదు’

By telugu teamFirst Published Oct 11, 2021, 2:23 PM IST
Highlights

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ఇండియన్ స్పేస్ అసోసియేషన్‌ను వర్చువల్ మీటింగ్‌లో ప్రారంభించారు. అంతరిక్ష రంగానికి చెందిన ప్రముఖులతో ఆయన మాట్లాడుతూ నేడు మనం ఐటీ యుగం నుంచి స్పేస్ యుగంలోకి అడుగిడబోతున్నామని వివరించారు. ఆ యుగంలో భారత్ వెనుకబడదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు ప్రభుత్వ అధీనంలోనే ఉన్న అంతరిక్ష రంగాన్ని ప్రైవేటురంగానికి అందుబాటులోకి తెచ్చామని వివరించారు.
 

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ఇండియన్ స్పేస్ అసోసియేషన్‌ను ప్రారంభించారు. వర్చువల్ మీటింగ్‌లోనే indian space associationను ప్రధాని narendra modi ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో space sector ప్రముఖులనుద్దేశించి మాట్లాడారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అంతరిక్షరంగంలో తీసుకున్న కీలక నిర్ణయాలను వెల్లడించారు. ఇదే రోజు జన్మించిన భారతరత్న జయప్రకాశ్ నారాయణ్, భారతరత్న నానాజీ దేశ్‌ముఖ్‌లను ప్రస్తావించారు. ప్రతి ఒక్కరినీ కలుపుకుంటూ అందరి ప్రయోజనాలకు పాటుపడ్డ వీరిద్దరూ ఇప్పటికీ ఆదర్శనీయులని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ మనమంతా ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగం నుంచి అంతరిక్ష యుగానికి వెళ్తున్నామని అన్నారు. అందులో భారత్ ఎట్టి పరిస్థితుల్లో వెనుకబడదని తెలిపారు. నాలుగు పునాదులే ఆధారంగా తాము ఖగోళ రంగంలో సంస్కరణలు తెచ్చామని వివరించారు. రోదసి రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు ప్రైవేటు రంగానికీ అవకాశమివ్వడం, ఈ రంగంలో ప్రభుత్వం సమన్వయకర్తగా వ్యవహరించడం, యువతను భవిష్యత్‌కు అనుగుణంగా తీర్చిదిద్దడం, సామాన్య పౌరుడి పురోగతికి అంతరిక్ష రంగాన్ని ఒక వనరుగా వినియోగించడం తమ ప్రధాన లక్ష్యాలని చెప్పారు. 

ఆత్మనిర్ భారత్ విజన్‌తో దేశం అనూహ్య సంస్కరణలను చూస్తున్నదని ప్రధాని మోడీ చెప్పారు. ఇది కేవలం ఒక విజన్ కాదని, సాలోచన, ఏకీకృత ఆర్థిక వ్యూహం దీని వెనుకా ఉన్నాయని, తద్వార అంతర్జాతీస్థాయి అభివృద్ధి దారులు పడుతాయని వివరించారు.

Also Read: ఇక మన ఆసుపత్రులు మరింత సమర్థవంతం.. ప్రధాని మోడీ

ఇప్పటి వరకు అంతరిక్ష రంగం కేవలం ప్రభుత్వ అధీనంలోనే కొనసాగిందని, తాము ఈ ఆలోచనను మార్చివేసి ప్రైవేటు భాగస్వామ్యాన్ని జోడిస్తున్నామని ప్రధాని మోడీ వివరించారు. తద్వారా ప్రభుత్వానికి, స్టార్టప్‌ల మధ్య సమన్వయానికి అవకాశం కల్పించామని తెలిపారు. ఇప్పుడీ సమయంలో అంతరిక్షం రంగంలో భారత్ దూసుకుపోవడానికి ప్రైవేటు భాగస్వామ్యం అవసరమని అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు అన్నీ ప్రభుత్వ అధీనంలోనే జరిగేవని, ఇకపై ప్రభుత్వం ఒక సమన్వయ కర్తగా వ్యవహరించడానికీ సిద్ధంగా ఉన్నదని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం.. నైపుణ్యాలను ప్రైవేటు భాగస్వామ్యంతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నదని, ప్రైవేటు రంగానికి స్పేస్ లాంచ్‌ప్యాడ్‌లను వినియోగించుకునే అవకాశం ఇస్తున్నదని వివరించారు. ఇప్పుడు ఇస్రో సదుపాయాలు ప్రైవేటురంగానికి అందుబాటులోకి తెచ్చామని చెప్పారు.

ప్రధానమంత్రి మోడీ మార్స్ మిషన్‌నూ గుర్తుచేశారు. నేడు అంతర్జాతీయ బాలికల దినోత్సవమని, మార్స్ మిషన్‌లో మహిళా శాస్త్రజ్ఞుల కృషిని ఈ రోజు గుర్తుచేసుకోవడం సముచితమని అన్నారు. అంతరిక్ష రంగంలోని గొప్ప సంస్కరణలు మహిళల భాగస్వామ్యాన్ని పెంచుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.

click me!